- కొత్త సవాళ్లు, అవసరాల నేపథ్యంలో పెద్దసంఖ్యలో ఐపీఎస్లు కావాలి
- రాష్ట్రంలో 83 మందే ఉన్నారు.. 105కు పెంచాలని రిక్వెస్ట్
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రం సైబర్ నేరాలు, డ్రగ్స్, వైట్ కాలర్ నేరాలు సహా ఇతర అనేక ఆధునిక సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఐపీఎస్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కీలక భద్రతాంశాలు, పోలీస్ విభాగం బలోపేతంపై బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి దాదాపు గంటపాటు భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో సీఎం వెంట రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్, ఎస్ఐబీ ఐజీపీ బి.సుమతి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజన అనంతరం 2016లో మొదటి క్యాడర్ రివ్యూ జరిగిందని.. 2021లో జరగాల్సిన క్యాడర్ రివ్యూ చాలా ఆలస్యంగా 2025లో జరిగిందని సీఎం తెలిపారు. ఆ సమయంలో ఏడుగురు ఐపీఎస్ అధికారులను మాత్రమే తెలంగాణకు కేటాయించారని గుర్తు చేశారు.
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి కమిషనరేట్ల పునర్ వ్యవస్థీకరణ, కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటు, హైదరాబాద్ నగరంలో భారీగా పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పెద్ద సంఖ్యలో ఐపీఎస్ అధికారుల అవసరం ఉందన్నారు. మూడో క్యాడర్ రివ్యూను నిర్దేశిత 2026 ఏడాదిలో చేపట్టాలని రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం 83 ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో ఉన్నారని.. ఆ సంఖ్యను 105 కు పెంచి కేటాయించాలని సీఎం కోరారు.
591 మంది మావోయిస్టులు తుపాకులు వీడారు
రెండేండ్లలో తెలంగాణలో 591 మంది మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలోకి వచ్చారని అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇటీవల కాలంలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు కూడా సాధారణ జీవితం గడిపేందుకు ముందుకు రావడం శుభపరిణామం అన్నారు. రాష్ట్రంలో తాజాగా అజ్ఞాతాన్ని వీడి బయటకు వచ్చిన మావోయిస్టు నేతల అంశంపై సుదీర్ఘంగా చర్చించారు.
అలాగే మిగిలిన మావోయిస్టు నేతల లొంగుబాటు, వారి పునరావాసానికి సంబంధించిన విషయాలను సీఎం ఈ సమావేశంలో వివరించారు. వీటితో పాటు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్రం నుంచి అందాల్సిన సహకారంపై పలు విజ్ఞప్తులు చేశారు.
