24 గంటల కరెంట్ ఇవ్వాల్సిందే.. త్వరలో కొత్త విద్యుత్ పాలసీ: సీఎం రేవంత్ రెడ్డి

24 గంటల కరెంట్ ఇవ్వాల్సిందే.. త్వరలో కొత్త విద్యుత్ పాలసీ: సీఎం రేవంత్ రెడ్డి

రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ పంపిణీకి ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. త్వరలోనే కొత్త విద్యుత్ పాలసీ తీసుకొస్తామని చెప్పారు.  ఇప్పటి వరకు ఉన్న విద్యుత్ విధానం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. గతంలో ఎక్కువ ధర చెల్లించడానికి గల కారణాలు చెప్పాలని.. తక్కవ ధరకు విద్యుత్ ఇచ్చే కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని ఆదేశించారు.

సెక్రటేరియట్ లో  విద్యుత్ శాఖ అధికారులు, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులతో  తో జనవరి 10న సమీక్షించారు. క ఈ  సమావేశంలో విద్యుత్తు వినియోగం, 24 గంటలపాటు నిరంతర విద్యుత్తు సరఫరా, విద్యుత్తు సంస్థల ఉత్పత్తి, కొత్తగా ఉత్పత్తి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికల్లో ఇచ్చిన గృహజ్యోతి పథకానికి 2వందల యూనిట్లను అందించడానికి తీసుకోవాల్సిన చర్యలు వంటివాటిపై సుదీర్ఘంగా చర్చించారు.  రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, వివిధ విద్యుత్ కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోళ్లు, రాష్ట్రంలో విద్యుత్ వినియోగం,  డిస్కమ్ల పనితీరు, ఆర్థిక పరిస్థితిపైనా వివరాలను సీఎంకు అధికారులు వివరించారు.  2014 నుంచి ఇప్పటిదాకా విద్యుత్ కంపెనీలకు, విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) మధ్య జరిగిన ఒప్పందాలు, ఆ ఒప్పందాల్లోని అంశాలు, విద్యుత్తుకు చెల్లించిన ధరలు వంటివాటిపై సమగ్రంగా అధ్యయనం చేసి, పూర్తి వివరాలను అందించాలని  అధికారులను  రేవంత్ రెడ్డి ఆదేశించారు.

వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విద్యుత్తు విధానాలను అధ్యయనం చేయాలని, ఆ రాష్ట్రాల్లోని విద్యుత్తు పరిస్థితులు, మెరుగైన విధానం ఏ రాష్ట్రంలో ఉందో అధ్యయనం చేసి, నివేదికలను ఇవ్వాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. అన్ని రాష్ట్రాలకంటే మెరుగైన విద్యుత్తు విధానాన్ని తెలంగాణలో అమలుచేయడానికి నిపుణులతో చర్చించి,  అసెంబ్లీలోనూ అన్ని రాజకీయపార్టీల ప్రజా ప్రతినిధులతో  సుదీర్ఘంగా చర్చించి, సరికొత్త విద్యుత్ పాలసీని తీసుకు వస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 

తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరాలని స్పష్ఠం చేశారు. ఆరు గ్యారంటీలలో ఒకటైన గృహజ్యోతి పథకం ద్వారా ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ పరంగా విద్యుత్తు ఉత్పత్తిని పెంచడానికి, మరిన్ని విద్యుత్ సంస్థలను ఏర్పాటు చేయడానికి ఉన్న అవకాశాలను, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ దుర్వినియోగాన్ని అరికట్టాలని, నాణ్యతను పెంచాలని సూచించారు. విద్యుత్తును నిరంతరం సరఫరా చేయడంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా పటిష్టంగా, ముందస్తు చర్యలను చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.