
- కొందరిపై నెపం నెట్టేందుకే కేసు సీబీఐకి అప్పగించారు
- కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులివ్వాలని డిమాండ్
- పోచారం శ్రీనివాస్రెడ్డితో కలిసి ఖర్గేతో భేటీ
న్యూఢిల్లీ, వెలుగు: నీట్ ఎగ్జామ్స్ నిర్వహణలో కేంద్ర సర్కార్ పూర్తిగా విఫలమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ఏ ఒక్కరి పైనో నెపం నెట్టి కేసును క్లోజ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కేసును మోదీ ప్రభుత్వం సీబీఐకి అప్పగించింది. ఇది సరైంది కాదు. దీనిపై పూర్తిస్థాయిలో జ్యుడీషియల్ ఎంక్వైరీ జరపాలి” అని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల కాంగ్రెస్లో చేరిన బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి ఢిల్లీలోని ఏఐసీసీ హెడ్ ఆఫీసుకు వచ్చారు.
అనంతరం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పోచారం శ్రీనివాస్రెడ్డిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఖర్గే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ భేటీ అనంతరం సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. నీట్ ఎగ్జామ్ నిర్వహణలో మోదీ గ్యారెంటీ ఏమైందని ప్రశ్నించారు. అందుకే మోదీ గ్యారెంటీకి వారెంటీ అయిపోయిందని ఎన్నికల ముందు నుంచి తాను చెప్తున్నానని అన్నారు. నీట్ వ్యవహారంలో సీబీఐ విచారణ సరిపోదని, జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ దిశలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. లక్షలాది మంది స్టూడెంట్ల జీవితాలతో చెలగాటం ఆడిన వారికి శిక్ష పడాల్సిందేనని సీఎం తేల్చిచెప్పారు. ‘‘కేంద్ర సర్కార్ ఎప్పుడైతే విఫలవుతుందో.. అప్పుడు ప్రధాని మోదీ మౌనం దాలుస్తరు. కానీ, నీట్ వ్యవహారంలో ప్రధాని మౌనం సాధ్యం కాదు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది యువకులు రోడ్లపైకి వస్తున్నరు. తెలంగాణలోనూ ఎన్ఎస్ యూఐ పిలుపు మేరకు వేలాది మంది స్టూడెంట్లు తమన నిరసన చేపట్టారు” అని ఆయన తెలిపారు.
రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి
త్వరలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రులతో జరిగిన భేటీలో స్పష్టం చేశానన్నారు. ప్రధాని మోదీ ఎప్పుడూ 5 ట్రిలియన్ల ఎకానమి గురించి మాట్లాడుతారని, అది నిజం కావాలంటే భారత్ లోని ఐదు మెట్రోపాలిటన్ సిటీల్లో ఒకటైన హైదరాబాద్ కు నిధులు కేటాయించాలని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్ లోని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం మద్దతివ్వాలన్నారు. హైదరాబాద్ లో కోటిన్నర జనాభా ఉందని.. అందువల్ల మెట్రో రైల్ చాలా అవసరంగా మారిందని చెప్పారు. దీనికి కేంద్ర సాయం కావాలని వినతి పత్రాలు సమర్పించినట్లు వివరించారు. ఈ అంశాలను విజ్ఞప్తి చేసేందుకు 8 మంది లోక్ సభ, ఇద్దరు రాజ్యసభ ఎంపీలతో కేంద్ర మంత్రులను కలిసినట్లు వెల్లడించారు.
రైతులకు మంచి జరగాలనే కాంగ్రెస్లోకి: పోచారం
సమర్థవంతమైన సీఎంగా రేవంత్ పేరు తెచ్చుకుంటున్నారని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆరునెలలుగా పరిపాలనను గమనిస్తున్నానని, అంకితభావంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని చెప్పారు. రేవంత్ నాయకత్వంలో రాష్ట్రంలో మంచి ఫలితాలు వస్తాయని విశ్వస్తున్నట్లు తెలిపారు. రైతులకు మంచి జరగాలనే రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ తాను, తన సైన్యం మొత్తం కాంగ్రెస్ లో చేరిందన్నారు. తన రాజకీయ జీవితమే కాంగ్రెస్ పార్టీలో ప్రారంభమైందని.. ఎక్కడైతే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందో మళ్లీ తన రాజకీయ ముగింపు కూడా ఆ పార్టీలోకే వచ్చిందని పోచారం అన్నారు.