సీఎం రేవంత్రెడ్డి పర్యటనతో కాంగ్రెస్ క్యాడర్ లో జోష్

 సీఎం రేవంత్రెడ్డి పర్యటనతో కాంగ్రెస్ క్యాడర్ లో జోష్

 

  • మున్సిపల్ ఎలక్షన్ కోసం సీఎం రేవంత్​రెడ్డి పర్యటన
  • జిల్లాతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం
  • స్టేట్ డెలప్​మెంట్​కు ఇక్కడి నుంచే పునాది వేస్తానని ప్రకటన 
  • రూ.800 కోట్లకు మించి పనులకు శంకుస్థాపన

నిజామాబాద్​, వెలుగు:   సీఎం రేవంత్​రెడ్డి పర్యటన కాంగ్రెస్ జిల్లా క్యాడర్​లో జోష్​ నింపింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సీఎం రావడంతో ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థ పరిధిలోని పార్టీ నేతలు, ప్రజలు తరలివచ్చారు. 5.20 గంటలకు మొదలైన సీఎం ప్రసంగం 6 గంటల వరకు సాగింది. ఆయన పదునైన కామెంట్స్​కు జనం ప్రతిస్పందించారు.

బీజేపీ, బీఆర్ఎస్ లను ఎక్కుపెడుతూ ఘాటైన విమర్శలు చేశారు. మున్సిపాలిటీల నుంచి ప్రజలు కోరుకునే మోరీల క్లీనింగ్ ఇతర లోకల్ అంశాలు స్టేట్ గవర్నమెంట్ పరిధిలోని అంశాల కోసం ఢిల్లీ వెళ్లి మోదీని కలువాలా? అని చేసిన కామెంట్​ సభికులను ఆలోచింపజేసింది. ఎంపీ అర్వింద్​ను ఉద్దేశించి కూడా విమర్శలు గుప్పించారు.

స్మార్ట్​ సిటీ, ఎయిర్​పోర్ట్​ శాంక్షన్​లో వైఫల్యం, ఫండ్స్​ సాధనలో ఆయన విఫల్యాన్ని వివరించారు. తమ సర్కార్​ మహిళా స్కీమ్​లకు ఇస్తున్న ప్రయారిటీ అంకెలతో వివరించారు. ఫ్రీబస్​ జర్నీ స్కీమ్​ను ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్​ సభలో నవ్వులు పూయించాయి. ఆర్టీసీ బస్సులో ఎవరైనా టికెట్​ అడిగితే మా అన్న చెబితే జర్నీ చేస్తున్నామని తన ఫొటో చూపమని మహిళలను కోరారు. 

టీపీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్​కు కారకులంటూ...

పంజాబ్​, హర్యానా రాష్ట్రాల రైతుల మాదిరి నిజామాబాద్ జిల్లా రైతులు చాలా చైతన్యవంతులని, పంట దిగుబడులకు సరైన రేట్ పొందడానికి,  హక్కులు సాధించుకోడానికి ఎంతటి పోరాటానికైనా వెనక్కు తగ్గరని అన్నారు. టీపీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా 2022లో రైతుల ఆహ్వానం మేరకు జిల్లాకు వచ్చిన తాను కాంగ్రెస్​ హైకమాండ్​ దృష్టిలో పడేలా చేసిందన్నారు.

పార్టీకి ప్రెసిడెంట్ ఇప్పుడు సీఎంను చేసిందన్నారు. అప్పటి నుంచి తనకు నిజామాబాద్​ జిల్లా స్పెషల్​గా మదిలో స్థిరపడి పోయిందన్నారు. రానున్న రోజుల్లో కూడా స్టేట్​ డెవలప్​మెంట్​కు ఈ జిల్లా నుంచే పునాది వేస్తానన్నారు. 70 ఏండ్ల కింద జవహర్​లాల్​ నెహ్రూ ప్రారంభించిన శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​ రైతుల ఆత్మగౌరవం పెరిగేలా పంటలసాగుకు కారణమైందన్నారు.  హెలిక్యాప్టర్​ పై నుంచి చూస్తే దసరా పండగ రోజు పాలపిట్టలను చూసినట్లుందని అన్నారు. దాశరథిని కూడా గుర్తు చేశారు. 

నెల కిందే ప్రోగ్రామ్​ ఫిక్స్​..

సీఎం ప్రోగ్రామ్​ నెల కిందే ఫిక్స్ అయింది. మున్సిపల్ ఎలక్షన్​ కోడ్​ దృష్ట్యా సభను రూరల్​ సెగ్మెంట్​లోని బర్దిపూర్​లో ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటలకు సహచర మంత్రులు ఉత్తమ్​కుమార్​రెడ్డి, తుమ్మల నాగేశ్వర్​రావుతో కలిసి హెలిక్యాప్టర్ దిగిన సీఎంకు గవర్నమెంట్ సలహాదారులు సుదర్శన్​రెడ్డి,  షబ్బీర్​అలీ, రూరల్​ ఎమ్మెల్యే డాక్టర్​ భూపతిరెడ్డి తదితరులు స్వాగతం చెప్పారు.

అఫీషియల్​ ప్రోగ్రామ్స్​లో భాగంగా బోధన్​, ఆర్మూర్​, నిజామాబాద్​లో రూ.600 కోట్ల ఖర్చుతో నిర్మించే యంగ్ ఇండియా ఇంటెగ్రేటెడ్​ స్కూల్స్​కు శంకుస్థాపన వేశారు. తెలంగాణ వర్సిటీలో బాయిస్​, గర్ల్స్​ హాస్టల్ బిల్డింగ్స్​, ఇండోర్​ స్టేడియం, అడ్మిన్​ బిల్డింగ్, ఏకలవ్య మోడల్ స్కూల్​ స్టాఫ్​ క్వార్టర్స్​కు శంకుస్థాపన చేసి వర్సిటీలోని సైన్స్​ ల్యాబ్​ ఓపెనింగ్ చేశారు. గాంధీనగర్​-బినోల రోడ్​, సిరన్​పల్లి-, నిజాంపూర్​ రోడ్​ విస్తరణ పనులకు సీఎం రేవంత్​రెడ్డి శంకుస్థాపన వేశారు.

కాళేశ్వరం 21వ ప్యాకేజీ పనులు పాత డిజైన్ ప్రకారం పూర్తి చేయాలి : రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి  

నిజామాబాద్​రూరల్​ : మంచిప్ప ప్రాంతంలో కొనసాగుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు 21వ ప్యాకేజీ పనులను  పాత డిజైన్ ప్రకారం పూర్తి చేయాలని రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సీఎం రేవంత్​రెడ్డిని కోరారు. శుక్రవారం సీఎం సభలో ఆయన మాట్లాడారు. 21వ ప్యాకేజీ పనులు పూర్తైతే నియోజకవర్గవ్యాప్తంగా రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు.

నిజామాబాద్ మండలం గుండారం గ్రామ శివారులోని 500 ఎకరాల ప్రభుత్వ స్థలంలో సెజ్​ను ఏర్పాటు చేయాలని కోరారు. జక్రాన్​పల్లి వద్ద  ఎయిర్​పోర్ట్​కు అనుమతులు రానందున అక్కడున్న 800 ఎకరాల భూమిలో డ్రైపోర్టు ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో సిబ్బంది కొరతను తీర్చి ఫార్మసీ కాలేజీ, ఫిజికల్​స్పోర్ట్స్​కాలేజీలను ఏర్పాటు చేయాలన్నారు. నిజామాబాద్​ కార్పొరేషన్​లో విలీనమైన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని తెలిపారు. ఇందల్​వాయి టోల్​ప్లాజా వద్ద అధునాతన గెస్ట్​హౌస్ నిర్మించాలన్నారు. పలు సమస్యలపై సీఎం రేవంత్​రెడ్డికి ఎమ్మెల్యే వినతిపత్రం అందజేశారు.