- ఫ్యూచర్ సిటీ టూ బందర్ పోర్ట్ గ్రీన్ఫీల్డ్ హైవేకు పర్మిషన్లు ఇవ్వండి
- రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయ రహదారి నిర్మించాలి
- కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగానికి సంబంధించి ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయినందున పనుల ప్రారంభానికి కేంద్ర కేబినెట్ అనుమతి ఇప్పించాలని జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. అలాగే, ట్రిపుల్ ఆర్ సౌత్ భాగానికి అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఆయన నివాసంలో సీఎం రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి, ఆర్ అండ్ బీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ప్రభుత్వ సలహాదారు, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు, స్పెషల్ సెక్రటరీ కో–ఆర్డినేషన్ అద్వైత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు అరగంటపాటు సాగిన ఈ భేటీలో ట్రిపుల్ ఆర్ ప్రాజెక్ట్ ఉత్తర భాగం పురోగతి, దక్షిణ భాగానికి అవసరమైన అనుమతులు, పనుల ప్రారంభంలాంటి అంశాలపై చర్చించారు. ట్రిపుల్ ఆర్ రెండువైపులా ఏకకాలంలో పనులు ప్రారంభమైతే నిర్మాణం త్వరగా పూర్తవుతుందని, నిర్మాణ వ్యయం తగ్గుతుందని సీఎం తెలిపారు. అలాగే, తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఏపీ రాజధానికి గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మిస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్నారని గుర్తు చేశారు.
అందువల్ల వెంటనే ఆ రహదారికి అనుమతులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందరు పోర్ట్కు 12 లేన్ రహదారి మంజూరు చేయాలని కోరారు.ఈ ప్రాజెక్ట్ పూర్తయితే హైదరాబాద్–విజయవాడ మధ్య 100 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు. అంతేకాకుండా హైదరాబాద్ నుంచి బందర్ పోర్ట్కు సరకు రవాణా వేగవంతమవుతుందని తెలిపారు.
అటవీ శాఖ అనుమతులు ఇప్పించండి
మన్ననూరు–శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్కు సంబంధించి అటవీ శాఖ అనుమతులు ఇప్పించేందుకు కృషి చేయాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్రెడ్డి రిక్వెస్ట్ చేశారు. నల్లమల అభయారణ్యం, శ్రీశైలం ఆలయం, శ్రీశైలం జలాశయాలు ఈ కారిడార్ పరిధిలో ఉంటాయని ఆ వివరాలను తెలియజేశారు. అలాగే, హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఉన్న రాజీవ్ రహదారికి ప్రత్యామ్నాయంగా మంచిర్యాల నుంచి హైదరాబాద్కు 6 లేన్ల ప్రత్యామ్నాయ రహదారికి అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రత్యామ్నాయ రహదారికి అవసరమైన భూ సేకరణ తాము చేపడతామని వివరించారు. ఈ రహదారి వ్యవసాయ, వ్యాపారపరంగా నూతన అవకాశాలను సృష్టిస్తుందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను కేంద్ర మంత్రితో పంచుకున్నారు.
