సోనియా గాంధీ మాటిస్తే.. అది శిలాశాసనం: సీఎం రేవంత్ రెడ్డి

సోనియా గాంధీ మాటిస్తే.. అది శిలాశాసనం: సీఎం రేవంత్ రెడ్డి

మాటిస్తే కాంగ్రెస్ వెనకడుగు వేయబొదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సోనియా గాంధీ  మాటిస్తే అది  శిలాశాసనమని చెప్పారు. సెక్రటేరియట్ లో  200 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. ఇచ్చిన మాట ప్రకారం హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు.  పేదల ఇండ్లలో వెలుగులు నింపుతున్నామన్నారు. చేవెళ్లలో లక్షమంది మహిళల ముందు రెండు గ్యారంటీలను ప్రారంభించాలనుకున్నాం కానీ ..  మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక  కోడ్ వల్ల చేవేళ్లలో ప్రారంభించలేకపోయామన్నారు రేవంత్.  అందుకే సెక్రటేరియట్ లో రెండు గ్యారంటీలను  ప్రారంభిస్తున్నామని చెప్పారు. 

పేదలకు  గ్యాస్ సిలిండర్ ఇవ్వాలన్న  ఆలోచన కాంగ్రెస్ దేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి.  ఆనాడు దీపం పథకం కింద మహిళలకు  రూ. 400 లకే కాంగ్రెస్  గ్యాస్ సిలిండర్  ఇచ్చిందన్నారు. బీజేపీ వచ్చాక గ్యాస్ సిలిండర్ ధర రూ.1200 లకు పెరిగింది.. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా రూ. 500లకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని చెప్పారు రేవంత్.  తాము ఇచ్చిన హామీలను నమ్మే ప్రజలు కాంగ్రెస్ కు ఓటేశారు..ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలిపారు.  సోనియా మాటిస్తే తెలంగాణలో తప్పకుండా చేస్తామన్నారు. 

ALSO READ :- భీమవరం నుండి పవన్ తప్పుకున్నట్టేనా..?

ఆర్థికంగా నియంత్రణ పాటిస్తూ ముందుకెళ్తున్నామని చెప్పారు రేవంత్.  నూటికి నూరుశాతం గ్యారంటీలు అమలు చేస్తాం..  ఎవరెన్ని ఎలాంటి దుష్ప్రచారాలు చేసినా నమ్మొద్దని సూచించారు. దేశంలో తెలంగాణ నమూనా తీసుకొస్తామని తెలిపారు.

ఇది నిరంతర ప్రక్రియ..ఆందోళన వద్దు: భట్టి

 ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా పథకాలు అమలు చేస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.  విప్లవాత్మక  నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు.  బడుగుబలహీన వర్గాల కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. దేశమంతా ఈ రెండు గ్యారంటీల కోసం ఎదురుచూస్తుందన్నారు.  ఎన్ని ఇబ్బందులున్నా వెనకడుగు వేయబోమన్నారు.  ఆర్థిక పరిస్థితిని చక్కబెడుతూనే హామీలు అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలపై బీఆర్ఎస్ రోజూ దష్ర్పచారం చేస్తోందన్నారు.  200 యూనిట్లు వాడే వారికి మార్చిలోపు  జిరో కరెంట్ బిల్లు వస్తుందని చెప్పారు భట్టి.  పథకాల అమలులో ఎలాంటి ఆంక్షలు విధించడం లేదన్నారు.  అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు.  అర్హులు మిగిలి ఉంటే మండలాఫీసుల్లో అప్లై చేసుకోవాలి..ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు భట్టి విక్రమార్క