
వనపర్తి, వెలుగు: జిల్లా కేంద్రం నుంచి పెబ్బేరు, పాన్ గల్ వైపు వెళ్ళే రహదారుల విస్తరణ పనులు ప్రారంభించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ తన ఛాంబర్ లో రోడ్డు విస్తరణ పై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో రోడ్డు విస్తరణ పనుల్లో చాలా జాప్యం జరుగుతోందని, ఆలస్యం చేయకుండా పనులు ప్రారంభించాలని రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు. రోడ్ల విస్తరణకు అడ్డుగా ఉన్న భవన నిర్మాణాలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
రోడ్డు విస్తరణలో స్థలం కోల్పోయే వారికి టీడీఆర్ బాండ్లు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో నాలుగింతలు లాభం ఉంటుందని టీడీఆర్ పై అవగాహన కల్పించాలని సూచించారు. రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోతున్న యజమానులతో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ ను సూచించారు. అడిషనల్ కలెక్టర్ యాదయ్య, ఆర్అండ్బీ ఈఈ దేశ్యా నాయక్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.