
నాగర్ కర్నూల్ టౌన్/కల్వకుర్తి, వెలుగు : ధాన్యం దిగుమతి, మిల్లింగ్ ప్రక్రియను స్పీడప్చేయాలని నాగర్కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. గురువారం కల్వకుర్తిలోని శ్రీ సద్గురు రాఘవేంద్ర పారాబాయిల్డ్ రైస్ మిల్ ను తనిఖీ చేశారు. మిల్లుకు రోజుకు ఎంత ధాన్యం చేరుతోంది, ఎంత మొత్తంలో ధాన్యాన్ని మిల్లింగ్చేస్తున్నారని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. మిల్లులో బియ్యం నిల్వలను పరిశీలించారు. మిల్లులో ఏమైనా తరుగు తీస్తున్నారా అని రైతులను ఆరా తీశారు.
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యాన్ని వెంటవెంట దిగుమతి చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. ఇప్పటికే 90 శాతానికి పైగా ధాన్యం సేకరణ ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. పెండింగ్ ఉన్న సీఎంఆర్ రైస్ ను ఎఫ్ సీఐకి తరలించాలని యాజమాన్యానికి ఆదేశించారు. కలెక్టర్ వెంట కల్వకుర్తి ఆర్డీవో శ్రీను, తహసీల్దార్ ఇబ్రహీం తదితరులున్నారు.
భూభారతి చట్టం అమలులో సర్వేయర్లు కీలకం
భూభారతి చట్టం అమలు, భూముల కొలతల్లో సర్వేయర్ల పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. గురువారం నాగర్ కర్నూల్ పట్టణంలోని కొల్లాపూర్ చౌరస్తా సమీపంలో రైతు వేదికలో లైసెన్సుడ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు.
మొదటి విడతలో 237 మంది లైసెన్సుడ్ సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నామని, జులై 26 వరకు తరగతులు కొనసాగుతాయని తెలిపారు. భూముల కొలతల్లో సర్వేయర్ల పాత్ర ఎంతో ముఖ్యమన్నారు. భూమి సరిహద్దులు గుర్తించడం, కొలతలు తీయడంలో సర్వేయర్ల పాత్రే కీలకమన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు.