సీఎంఆర్​ లక్ష్యాలను పూర్తి చేయాలి  : మధుసూదన్ నాయక్

సీఎంఆర్​ లక్ష్యాలను పూర్తి చేయాలి  : మధుసూదన్ నాయక్

ఖమ్మం టౌన్,వెలుగు: గడువులోగా కస్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాలను పూర్తి చేయాలని అడిషనల్​ కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. బుధవారం న్యూ కలెక్టరేట్ లో  సంబంధిత శాఖల అధికారులతో సీఎంఆర్ లక్ష్యాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఆయన సమీక్షించారు. జిల్లాలో సీఎంఆర్​ లక్ష్యాన్ని గడువులోగా పూర్తి చేయకుంటే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఏప్రిల్ 1 నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు. జిల్లాలో మొత్తం 223 సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రస్తుతం ఎన్నికల నియమ నిబంధనలు అమలులో ఉన్నందున రాజకీయ నాయకుల ద్వారా కేంద్రాల ప్రారంభోత్సవాలు చేయొద్దని సూచించారు.

ప్రతి కేంద్రంలో వ్యవసాయ శాఖ, ఐకేపీ, సహకార శాఖ, హార్టికల్చర్, సంబంధిత అధికారులు, బృందంగా ఏర్పడి కొనుగోలు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సన్యాసయ్య, జిల్లా పౌరసరఫరాల అధికారి చందన్ కుమార్, జిల్లా సహకార అధికారి మురళీధర్ రావు, డీఎం సివిల్ సప్లై శ్రీలత పాల్గొన్నారు.