- కలెక్టర్ పమేలా సత్పతి
గంగాధర, వెలుగు: బాలికల్లో ధైర్యం, భరోసా నింపేందుకే స్నేహిత కార్యక్రమం నిర్వహిస్తున్నామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. గంగాధర మండలం గర్శకుర్తి స్కూల్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మంగళవారం స్నేహిత- -2 అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికల భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రతి స్కూల్లో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఫిర్యాదుల పెట్టె తాళం చెవి నోడల్ ఆఫీసర్, షీ టీం సిబ్బంది వద్ద ఉంటుందని, విద్యార్థినులు తమకు జరిగిన ఇబ్బందులను పేపర్పై రాసి ఇందులో వేస్తే అధికారులే విచారించి చర్యలు తీసుకుంటారని వివరించారు.
బాలికలు, మహిళలను ఎవరైనా వేధించినా, అసభ్యకరంగా ప్రవర్తించినా ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని, టోల్ ఫ్రీ నంబర్ 1098, 100కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం పోక్సో చట్టం గురించి వివరించారు. మహిళలకు ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకే శుక్రవారం సభకు శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ తెలిపారు.
అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతం, చిన్నారులకు అన్నప్రాశన చేశారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్మన్ ధనలక్ష్మి, షీ టీమ్ సీఐ శ్రీలత, డీడబ్ల్యూవో సరస్వతి, వైద్యశాఖ ప్రోగ్రాం ఆఫీసర్ సనా, బాలికల అభివృద్ధి అధికారి కృపారాణి, తహసీల్దార్ అంబటి రజిత, ఎంపీడీవో రాము, ఎంఈవో ప్రభాకర్రావు పాల్గొన్నారు.
మౌలానా అబుల్ కలాం సేవలు మరువలేనివి
కరీంనగర్ టౌన్, వెలుగు: దేశ మొదటి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు మరవలేనివని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో మౌలానా అబుల్ కలాం జయంతిని నిర్వహించారు.
ఈ సందర్భంగా మౌలాని ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, మైనారిటీ సంక్షేమ అధికారి అధికారి, డీఆర్వో బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు
