పత్తి, ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయండి: కర్ణన్

పత్తి, ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయండి: కర్ణన్

నల్గొండ అర్బన్, వెలుగు: జిల్లాలో పత్తి, ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆర్‌‌‌‌వీ కర్ణన్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌‌లో  వ్యవసాయ, మార్కెటింగ్, సివిల్‌‌ సప్లై, పోలీసు, రెవెన్యూ, ఫైర్‌‌‌‌, రవాణా శాఖల అధికారులతో సమీక్షించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పత్తి క్వింటాల్‌‌కు రూ.7020, ధాన్యం గ్రేడ్ -ఏ రకానికి రూ. 2203,  కామన్ గ్రేడ్‌‌కు రూ. 2183 మద్దతు ధర ఇస్తోందని చెప్పారు. పత్తి సెంటర్లు ఏర్పాటు చేసే జిన్నింగ్ మిల్లును అగ్నిమాపక అధికారులు తనిఖీ చేసి సేఫ్టీ ఏర్పాట్లపై రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. 

ధాన్యం కేంద్రాలు నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో సెంటర్లు ఏర్పాటు చేయవద్దని,  క్లస్టర్ల వారీగా ధాన్యం తరలించేందుకు ఏఈవోలు చర్యలు తీసుకోవాలన్నారు. రెండు పంటలను బయోమెట్రిక్ విధానం ద్వారా సేకరిస్తామని, రైతులు బ్యాంకు ఖాతాకు ఆధార్‌‌‌‌ను లింక్ చేసుకోవాలని సూచించారు. రవాణాశాఖ అధికారులు ట్రాన్స్‌‌ఫోర్ట్ ఇబ్బందులు లేకుండా చూడాలని, లోడింగ్, అన్‌‌లోడింగ్ త్వరగా అయ్యేట్లు ఏర్పాట్లు చేయాలన్నారు.  ఈ సమావేశంలో అడిషనల్‌‌ కలెక్టర్ శ్రీనివాస్, సివిల్‌‌ సప్లై ఆఫీసర్‌‌‌‌ వెంకటేశ్వర్లు,  మేనేజర్ నాగేశ్వరరావు, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, ఆర్టీవో, మార్కెటింగ్ అధికారి శ్రీకాంత్, డీఏవో శ్రవణ్ ,జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు పాల్గొన్నారు.

అధికారులు అలర్ట్‌‌గా ఉండాలి

మునుగోడు, చండూరు, వెలుగు: ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని  కలెక్టర్ఆర్‌‌‌‌వీ కర్ణన్ సూచించారు. బుధవారం  మునుగోడు, చండూరులో ఈవీఎం డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్‌‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదిత భవనాలను పరిశీలించారు.  భోజనాలు, వాహనాల పార్కింగ్‌‌,  బ్యారికేడ్ల ఏర్పాటుపై అధికారులకు సూచనలు చేశారు. ఈవీఎంలు భద్రపరిచేందుకు  తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌‌తో పాటు అదనపు ఈవీఎంలు భద్రపరిచేందుకు సరైన హాల్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ నెల 20 న మొదటి ర్యాండమైజేషన్ తర్వాత ఈవీఎంలను నియోజకవర్గాలకు కేటాయిస్తామని చెప్పారు.  కలెక్టర్‌‌‌‌ వెంట ఆర్‌‌‌‌డీవో దామోదర రావు, తహసీల్దార్లు రవీందర్ రెడ్డి, నరేందర్, మున్సిపల్ కమిషనర్ మణికరణ్ ఉన్నారు.