
గద్వాల, వెలుగు: భూ సమస్యలన్నింటికీ భూభారతి ద్వారా పరిష్కారం చూపిస్తామని జోగులాంబ గద్వాల కలెక్టర్ సంతోష్ తెలిపారు. గురువారం అలవలపాడు జీపీ ఆఫీసులో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ రికార్డుల్లో పేరు తప్పులు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు.. వంటి సమస్యలపై అప్లికేషన్లు ఇవ్వాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలి
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ సంతోష్ ఆఫీసర్లను ఆదేశించారు. గురువారం ధరూర్ మండలం అలవలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇండ్ల నిర్మాణాలకు విడతలవారీగా రూ.5 లక్షలు అందజేస్తుందన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న నిధులతో లబ్ధిదారులు త్వరగా ఇండ్ల నిర్మాణాలను కంప్లీట్ చేసుకోవాలన్నారు.
400 నుంచి 600 చదరపు గజాల్లోపు ఇంటిని నిర్మించుకోవాలని సూచించారు. గ్రామంలో మంజూరైన ఇండ్లలో 32 బేస్మెంట్, రెండు రూఫ్ లెవల్ దశలో ఉన్నాయని తెలిపారు. 21 మంది లబ్ధిదారులకు లక్ష రూపాయలు మొదటి విడత నిధులు జమ చేశామన్నారు. అనంతరం అల్వలపాడ్ గ్రామంలో ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు.