భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం : కలెక్టర్ బదావత్ సంతోష్

భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం : కలెక్టర్  బదావత్  సంతోష్

కోడేరు, వెలుగు: భూభారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నాగర్ కర్నూల్  కలెక్టర్  బదావత్  సంతోష్  తెలిపారు. కోడేరు మండలం తీగలపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ అవగాహన సదస్సుకు అడిషనల్​ కలెక్టర్  పి. అమరేందర్ తో కలిసి హాజరయ్యారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. రెవెన్యూ సదస్సులపై ప్రజలకు ముందుగానే సమాచారం అందజేయాలని, దరఖాస్తులను పరిశీలించి అక్కడికక్కడే పరిష్కరించే సమస్యలకు పరిష్కారం చూపాలని తహసీల్దార్  విజయ్ కుమార్ ను ఆదేశించారు. ఈ నెల 20 వరకు అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.  

అనంతరం పైలెట్  ప్రాజెక్టుగా ఎంపికైన పసుపుల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా పేదవారు ఇల్లు కట్టుకునేందుకు ఇబ్బంది పడుతుంటే స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా రుణం అందించేలా చూడాలన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. వడ్లు తడవకుండా కప్పి ఉంచాలని, లారీల కొరత లేకుండా చూసుకోవాలని, కొనుగోలు చేసిన వడ్లను వెంటనే మిల్లులకు తరలించాలని నిర్వహకులను ఆదేశించారు.

పెబ్బేరు: రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకొని, తమ సమస్యలు పరిష్కరించుకోవాలని అడిషనల్  కలెక్టర్​ వెంకటేశ్వర్లు సూచించారు. పెబ్బేరు, శ్రీరంగాపూర్  మండలాల్లో జరిగిన రెవెన్యూ సదస్సులను సందర్శించారు. దరఖాస్తులను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అనంతరం పెబ్బేరు పర్యటనలోని రేషన్ షాపును తనిఖీ చేశారు. సన్న బియ్యం నాణ్యతపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.

మరికల్: భూభారతి చట్టం పేదలకు వరమని నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్​రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని తీలేరు, జిన్నారం గ్రామాల్లో బుధవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ప్రజల ఫిర్యాదులను స్వీకరించి అధికారులు రసీదు అందజేశారు. ఏండ్లుగా పెండింగ్​లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రశాంత్​రెడ్డి తెలిపారు. తహసీల్దార్​ రాంకోటి, ఆర్ఐ విజయ్​కుమార్​ ఉన్నారు.