
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో పోలీస్, రవాణా, జాతీయ రహదారులు, వైద్యారోగ్యశాఖ, ఆర్ ఆండ్ బీ శాఖల అధికారులతో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతు జిల్లా టాస్క్ పోర్స్ కమిటీ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించి రోడ్డు ప్రమాదాలను నివారించాలన్నారు.
రాష్ట్ర రహదారులు, నేషనల్ హైవే 167,44 పై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. స్టేట్ హైవే వెదిర క్రాస్ రోడ్, పాలకొండ బైపాస్ ఎక్స్ రోడ్, పిస్తా హౌజ్ క్రాస్ రోడ్ ఈ ఏడాది నిర్వహణ నిధుల నుంచి రోడ్డు భద్రతకు సంబంధించి రంబుల్ స్ట్రిప్ లు,సైన్ బోర్డ్ లు ఆగస్టు చివరిలోగా ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలో పిట్ నెస్ సర్టిఫికెట్ లేని 447 స్కూల్ బస్సులను అనుమతించవద్దని రవాణా, పోలీస్ శాఖ అధికారులను ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలపై పాఠశాలల విద్యార్థులకు అవగాహన కలిగించాలని సూచించారు. సమావేశంలో ఎస్పీ డి.జానకి, అడిషనల్ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ఆర్ అండ్ బీ ఈఈ దేశ్యానాయక్, ట్రాన్స్ఫోర్ట్డిప్యూటీ కమిషనర్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.
ల్యాండ్ దరఖాస్తులు ఎన్ని వచ్చినా తీసుకోండి
అడ్డాకుల, వెలుగు: భూముల సమస్యలపై ఎలాంటి దరఖాస్తులు వచ్చినా స్వీకరించాలని మహబూబ్నగర్ కలెక్టర్ విజయేంద్రబోయి అన్నారు. అడ్డాకుల మండలం కాటవరం గ్రామంలో రెవెన్యూ సదస్సులను ఆమె గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె రైతుల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శేఖర్, ఆర్ఐలు సృజన్, శశికిరణ్ పాల్గొన్నారు.