ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిర్మల్,వెలుగు: నిర్మల్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఈనెల 25న పంపిణీ చేస్తామని కలెక్టర్ ముషారఫ్​అలీ ఫారూఖీ తెలిపారు. బుధవారం కలెక్టరేట్​లో రివ్యూ నిర్వహించారు. సర్వేల ఆధారంగా మొత్తం 1,726 మందిని గుర్తించినట్లు తెలిపారు. బంగల్ పేట, నాగనాయిపేట, కౌట్లలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను శుక్రవారం స్థానిక తిరుమల గార్డెన్, దివ్య గార్డెన్, రాజేశ్వర గార్డెన్ లో లాటరీ పద్ధతిన కేటాయిస్తామన్నారు. ఎవరూ దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ఎవరైనా డబ్బులు డిమాండ్​చేస్తే తన దృష్టికి తీసుకురావాలని కలెక్టర్​సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు హేమంత్ బోర్కాడే, రాంబాబు అధికారులు పాల్గొన్నారు.

కేసీఆర్​ను ఇంటికి పంపాలె

భైంసా,వెలుగు: ప్రజా వ్యతిరేక విధానాలు అవలబిస్తున్న సీఎం కేసీఆర్​ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్​రావు పటేల్ కోరారు. బుధవారం తానూర్​ మండలం వడ్​గాంలో బీజేపీ జెండా పండుగ నిర్వహించారు. ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజాసంగ్రామ యాత్రకు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.  

అర్హులకే ఇండ్లు ఇవ్వాలి...

తానూర్​మండలంలో అర్హులకే డబుల్​బెడ్​రూమ్​ఇండ్లు కేటాయించాలని మోహన్​రావు పటేల్​డిమాండ్​ చేశారు. ఆఫీసర్లు టీఆర్ఎస్ లీడర్లకు తొత్తులుగా మారొద్దన్నారు. అనంతరం తహసీల్దార్​కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుభాష్​ జాదవ్​, లీడర్లు విజయ్, రమేశ్, సాయినాథ్, శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.

ఎదుగుదల ఓర్వలేకనే ఆరోపణలు

ఖానాపూర్, వెలుగు: బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేకనే ఆమెపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, రమాదేవి పార్టీ మారే ప్రసక్తేలేదని గిరిజన మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, పెంబి జడ్పీటీసీ భూక్యా జాను బాయి తెలిపారు. బుధవారం ఆమె స్థానికంగా మీడియాతో మాట్లాడారు. ముథోల్​లో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని తెలిపారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు సదాశివ, లీడర్​గోపాల్ రెడ్డి ఉన్నారు.

లైబ్రరీ అభివృద్ధి శుభపరిణామం

బెల్లంపల్లిరూరల్,వెలుగు: నెన్నెల వెటర్నరీ హాస్పిటల్​వద్ద ఉన్న లైబ్రరీ అభివృద్ధికి కృషిచేయడం శుభపరిణామమని బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, ఎంపీటీసీ బొమ్మెన హరీశ్​గౌడ్ చెప్పారు. సమస్య పరిష్కరించాలని కలెక్టర్, గ్రంథాలయ సంస్థ చైర్మన్  ప్రవీణ్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించి గ్రంథాలయ రూపురేఖలు మార్చేందుకు హామీ ఇచ్చి 
నెరవేర్చారన్నారు. 

కో ఆప్షన్ సభ్యుడిగా హమత్  ఖాన్

బెల్లంపల్లి రూరల్: తాండూరు మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యుడిగా రహమత్ ఖాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. బుధవారం ఎంపీపీ ప్రణయ్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన మీటింగ్​లో ఆయన ఎన్నికను ప్రకటించారు.

స్విమ్మింగ్​తో ఆరోగ్యం

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: స్విమింగ్ ద్వారా ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం లభిస్తుందని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తెలిపారు. స్విమ్మింగ్ అసోసియేషన్​ సౌత్​జోన్ జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీలను బుధవారం ఆయన స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ప్రారంభించారు. అసోసియేషన్​ కార్యదర్శి మహేందర్​ జిత్, డీవైఎస్​వో వెంకటేశ్వర్లు, ఒలింపిక్ అసోసియేషన్​ అధ్యక్షుడు బి.గోవర్దన్​రెడ్డి, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, కోచ్  కొమ్ము కృష్ణ, సన్ని పాల్గొన్నారు.

దివ్యాంగులు క్రీడల్లో పాల్గొనాలి

ఆదిలాబాద్​టౌన్, వెలుగు: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రీడోత్సవాల్లో దివ్యాంగులు పాల్గొన్నాలని కలెక్టర్​ సిక్తా పట్నాయక్​కోరారు. బుధవారం కలెక్టర్ క్రీడలను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్​చైర్మన్  జోగు ప్రేమేందర్, ఆర్​డీవో రమేశ్​రాథోడ్, ఐసీడీఎస్ పీడీ మిల్కా, డీవైఎస్​వో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ఆసిఫాబాద్,వెలుగు: దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల కళాశాల మైదానంలో మహిళ, శిశు, వయోవృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహించారు. జిల్లా స్థాయి క్రీడా పోటీలను జిల్లా సంక్షేమ అధికారి సావిత్రితో కలిసి కలెక్టర్​ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి  బూర్ల మహేశ్, స్కూల్ గేమ్స్ సెక్రటరీ మధుసూదన్  తదితరులు పాల్గొన్నారు.

మానవసేవే మాధవసేవ

నస్పూర్,వెలుగు: మానవ సేవే మాధవ సేవ అని సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు రాధాకుమారి చెప్పారు. బుధవారం సీసీసీ, శ్రీరాంపూర్ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో  పేదలకు అమృత కలశలు, దుప్పట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాలిటెక్నిక్ కాలేజి ప్రిన్సిపాల్  శ్రీనివాసరావు దంపతులు, ఏరియా ఇంజినీర్ చంద్రశేఖర్ రెడ్డి,  రాజేశ్వర్ రెడ్డి, ఏవీ రెడ్డి, డీజీఎంలు శివరావు, నాగేశ్వరరావు, గోవిందరాజు, డీవీ రావు,నూక రమేశ్, ఉమారాణి, నాగమణి, విజయ, మంజు, సుజాత, భాస్కర్, సురేశ్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విశాక ట్రస్ట్​ ఆధ్వర్యంలో చెన్నూర్ డిగ్రీ కాలేజీకి 20 ఫ్యాన్లు అందజేత

చెన్నూర్,వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్​ జి.వివేక్​ వెంకటస్వామి విశాఖ చారిటుల్​ ట్రస్ట్​ ద్వారా చెన్నూర్​ ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి ఇచ్చిన 20 ఫ్యాన్లను ఆ పార్టీ నాయకులు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలేజీ క్లాస్ రూంలలో ఫ్యాన్లు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని వివేక్​ వెంకటస్వామి దృష్టికి తీసుకురావడంతో ఆయన రూ.50 వేల విలువైన ఫ్యాన్లు అందించారని తెలిపారు. ఈ ఫ్యాన్లను వెంటనే క్లాస్​ రూంలలో ఫిటింగ్​ చేయించామన్నారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ శ్రీదేవి...​ వివేక్​ వెంకటస్వామికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే విశాఖ ట్రస్ట్ ద్వారా చెన్నూర్​, కోటపల్లి, జైపూర్​, భీమారం మండలాల్లోని పలు ప్రభుత్వ స్కూళ్లకు బెంచీలు, ఫ్యాన్లు అందజేశారని చెప్పారు. ఇంకా ఏమైనా విద్యాసంస్థలో అవసరాలు ఉంటే ట్రస్ట్ ద్వారా సాయం అందించడానికి వివేక్​ వెంకటస్వామి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ జాయింట్​ కన్వీనర్ నగునూరు వెంకటేశ్వర్లుగౌడ్, చెన్నూర్ టౌన్ ప్రెసిడెంట్ సుద్దపల్లి సుశీల్​కుమార్, ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కొంపెల్లి బానేశ్, పెండ్యాల శ్రీకాంత్, బూత్ అధ్యక్షుడు అడుప మల్లికార్జున్ పాల్గొన్నారు.

గుండెగాం గోస తీరినట్టే..!

భైంసా,వెలుగు: ముథోల్ నియోజకవర్గంలో ఈ నెల 28 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ పాదయాత్ర ప్రారంభం కానుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్​అయ్యింది. ఏటా వర్షాకాలంలో పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​తో ముంపునకు గురయ్యే గుండెగాం గ్రామంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ సర్వే పనులు ప్రారంభించింది. నాలుగు రోజుల్లో సర్వే పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంది. దీంతో గ్రామస్తులు తమ సమస్య తీరినట్లేనని సంతోషపడుతున్నారు. బుధవారం తహసీల్దార్​ఆఫీస్​లో పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. మొత్తం మూడు బృందాలకు శిక్షణ ఇచ్చి సర్వే కోసం దిశా నిర్దేశం చేశారు. బండి సంజయ్​పాదయాత్రతో సర్వేకు మోక్షం లభించిందని, తమ కష్టాలు తీరినట్లేననీ గ్రామస్తులు పేర్కొంటున్నారు.

ధర్మాన్ని విచ్ఛినానికి కుట్ర చేస్తున్రు

భైంసా,వెలుగు: తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాల్లో హిందూ ధర్మాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నారని ఉస్మానియా వర్సిటీ రిటైర్డ్​ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. బుధవారం భైంసాలో జరిగిన యువ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. యువత ధర్మ రక్షణకు, సంస్కృతి పరిరక్షణకు కంకణబద్దులై మతతత్వ శక్తుల దుశ్చర్యలపై జాగృతం కావాలని పిలుపునిచ్చారు. పీఎఫ్ఐ, లవ్​జిహాద్ సంస్థల ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయన్నారు. మత మార్పిడులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. పాశ్చత్య ధోరణితో ఆధునికత వైపు పయనిస్తూ సంస్కృతీసంప్రదాయాలను విస్మరిస్తున్నారన్నారు. దేశ విచ్చిన్నకర శక్తులతో పరిస్థితి ప్రమాదకరంగా మారుతోందని తెలిపారు. యువత ఏకమై మతతత్వ శక్తుల ఆగడాలను, విచ్ఛిన్నకర శక్తుల ఆకృత్యాలను నిరోధించే దిశగా ముందుకెళ్లాలన్నారు. లవ్​జిహాద్ పట్ల అమ్మాయిలను చైతన్యపర్చాలని పిలుపునిచ్చారు. నైజాం రజాకార్ల ఆకృత్యాలు, ఆగడాలను వివరించారు. కార్యక్రమంలో ఆకాశ్​పటేల్, ఆర్ఎస్ఎస్​లీడర్లు రాజుల్ వార్​దిగంబర్, సాదుల కృష్ణదాస్, సరికొండ దామోదర్, రమేశ్, శైలేశ్​మాశెట్టివార్, శ్యాంసుందర్​మాంధని, నరేశ్, ఎల్ఐసీ శ్రీనివాస్, ఎన్ఆర్ఐ బాజీరావు పటేల్, రాజు, మహిపాల్, వెంకటేశ్​గుజ్జుల్​వార్, బీజేపీ సీనియర్​లీడర్లు నారాయణ్​రెడ్డి, గోపాల్​సార్డా, రవి పాండే, ముథోల్ సెగ్మెంట్​కన్వీనర్​ తాడేవార్​సాయినాథ్, తపస్​జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రాజేశ్వర్​ తదితరులు పాల్గొన్నారు.

మొక్రా(కె) గ్రామాభివృద్ధి భేష్​

ఇచ్చోడ,వెలుగు: మొక్రా (కె) గ్రామాభివృద్ధి భేష్​అని కలెక్టర్ సిక్తా పట్నాయక్​చెప్పారు. బుధవారం పలు పలు సంక్షేమ కార్యక్రమాలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ గ్రామం మొక్రా(కె)ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గ్రామాభివృద్ధి కోసం పనిచేస్తున్న సర్పంచ్ గాడ్గే మీనాక్షి సుభాష్​ను ప్రశంసించారు. సోలార్ గ్రిడ్, డిజిటల్ లైబ్రరీ, బృహత్ పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. గ్రామంలో నిర్వహించిన క్రికెట్​పోటీలను కలెక్టర్​ ప్రారంభించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్​కాసేపు బ్యాటింగ్​చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రిజ్వాన్ బాషా, పీడీ కిషన్, అడిషనల్ పీడీ రవీందర్, డీపీవో శ్రీనివాస్, ఎంపీటీసీ గాడ్డే సుభాష్, ఎంపీపీ ప్రీతంరెడ్డి, ఎంపీడీవో  రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.  

పేదలకు దుప్పట్లు పంపిణీ 

మందమర్రి/రామకృష్ణాపూర్,వెలుగు: మందమర్రి సత్యసాయిబాబా ఆలయం, రామకృష్ణాపూర్​ సాయిప్రశాంతి మందిర్​లో బుధవారం వేర్వేరుగా సత్యసాయిబాబా 97వ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా 60 మంది పేతలకు జీఎం సతీమణి చింతల లక్ష్మీశ్రీనివాస్,  ఎస్​వోటు జీఎం సతీమణి లక్ష్మీకృష్ణారావు, సత్యసాయి సేవాసమితి, ఆలయ కమిటీ మెంబర్లు దుప్పట్లు పంపిణీ చేశారు. రామకృష్ణాపూర్​లో దివ్యాంగులు, నిరుపేదలకు సత్యసాయిబాబా సేవా సమితి సభ్యులు కన్వీనర్ కేడీవీ ప్రసాద్, మెంబర్లు దుప్పట్లు అందజేశారు. సింగరేణి ఏరియా హాస్పిటళ్లోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. 

సమస్యలు పట్టించుకోని కేకే యాజమాన్యం

మందమర్రి,వెలుగు: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కళ్యాణిఖని ఓసీపీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏఐటీయూసీ బ్రాంచి వైస్ ప్రెసిడెంట్​భీమనాధుని సుదర్శనం ఆరోపించారు. బుధవారం కేకే ఓసీపీపై నిర్వహించిన గేట్ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ఎంప్లాయీస్​కు క్వాలిటీ టిఫిన్స్​అందడంలేదని ఆరోపించారు. డిపార్ట్​మెంట్ వైజ్ గా డిస్ట్రిబ్యూషన్ పాయింట్, జనరల్​ మజ్దూర్​ఎంప్లాయీస్​కు అనుకూలమైన రెస్ట్​హాల్ ను అందుబాటులో ఉంచాలన్నారు. మహిళ ఎంప్లాయిస్​కు సపరేట్ రెస్ట్ రూమ్, టాయిలెట్స్​ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. ఓసీపీ ఎంప్లాయిస్ కోసం సులభ్​​ కాంప్లెక్స్ సౌలత్ కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఓసీపీ పిట్ సెక్రటరీ మర్రి కుమార్, మైనింగ్ స్టాఫ్ ఇన్​చార్జి సత్యనారాయణ, లీడర్లు కోటయ్య, సారయ్య, దివాకర్, ఇప్ప రాజేశ్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 

ఓటరుగా నమోదు చేసుకోవాలి 

మంచిర్యాల, వెలుగు: సమర్థవంతమైన ప్రభుత్వ నిర్మాణంలో ఓటు హక్కు ప్రధానమని,  18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా ఓటరు జాబితా పరిశీలకులు, గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ.శ్రీధర్​ అన్నారు. బుధవారం కలెక్టరేట్​లో కలెక్టర్​ భారతి హోళికేరి, అడిషనల్​ కలెక్టర్లు మధుసూదన్​ నాయక్​, రాహుల్​తో కలిసి ఎలక్షన్​ రిటర్నింగ్​ ఆఫీసర్లు, ఆర్డీవోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా సవరణపై రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ప్రతి సంవత్సరం జనవరిలో ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతుందని, ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదుపై అధికారులకు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. 

ఉసిరి ఉత్పత్తులు, సేంద్రియ ఎరువులు రెడీ  

ఇచ్చోడ, వెలుగు: వినియోగదారుల కోసం ఉసిరి ఉత్పత్తులు, సేంద్రియ ఎరువులు రెడీగా ఉన్నాయని ఐటీడీఏ పీవో  వరుణ్​రెడ్డి తెలిపారు. బుధవారం ఉట్నూర్ కేబీ కాంప్లెక్స్ లో సీపీఎఫ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉసిరి ఉత్పత్తుల విక్రయ కేంద్రం, సేంద్రియ ఎరువుల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఉసిరి ఉత్పత్తులు సామాన్యులకు అందించాలనే ఉద్దేశంతో విక్రయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సేంద్రియ ఎరువులు రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఎఫ్​సంస్థ డైరెక్టర్ గిరిజ తదితరులు పాల్గొన్నారు.