ఇండియాలో పెట్టుబడులకు సరైన సమయమిదే

ఇండియాలో పెట్టుబడులకు సరైన సమయమిదే

న్యూఢిల్లీ: ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి ఇదే సరైన తరుణమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇండియా ఐడియాస్ సమ్మిట్‌ 2020లో మాట్లాడిన మోడీ ఇన్వెస్ట్‌మెంట్స్ అవసరాన్ని నొక్కి చెప్పారు. అవకాశాల గడ్డగా ఇండియా అవతరిస్తోందన్నారు. ఇండియా–యూఎస్ స్నేహం గతంలో సరికొత్త ఎత్తులను తాకిందని.. ఇప్పుడు ప్రపంచం మళ్లీ కోలుకోవడానికి ఈ రెండు దేశాల ఫ్రెండ్‌షిప్‌ హెల్ప్‌ అవుతోందన్నారు. ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇదే కరెక్ట్‌ టైమ్‌ అని, ఇరు దేశాల పరస్పర వృద్ధికి అమెరికా కంపెనీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మోడీ చెప్పారు. ప్రధాని మోడీ పాల్గొన్న ఈ వర్చువల్ సమ్మిట్‌లో విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్, యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపియో కూడా హాజరయ్యారు.

‘గత ఆరేళ్లలో దేశాన్ని ఆర్థికంగా, సరళీకరణల విషయంలో ఎదిగేలా చాలా చర్యలు చేపట్టాం. రీఫార్మ్‌ వల్ల పోటీతత్వం పెరిగింది. పెరిగిన పారదర్శకత, డిజిటైజేషన్‌ విస్తరణ, ఇన్నోవేషన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం, నిలకడైన విధానాలతో సరళీకరణలు విజయవంతం అయ్యాయి. కొత్త అవకాశాలకు ఇవ్వాళ ఇండియా చాలా పెద్ద డెస్టినేషన్‌గా మారింది. ఉదాహరణకు టెక్‌ సెక్టార్‌‌ను చెప్పొచ్చు. దేశంలో అర్బన్ ఇంటర్‌‌నెట్ యూజర్ల సంఖ్యను తొలిసారిగా రూరల్ ఇంటర్‌‌నెట్ యూజర్లు దాటారు. టెక్నాలజీ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయి. 5జీ, బిగ్ డేటా అనాలిసిస్, క్వాంటమ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్ లాంటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌కు మంచి ఫ్యూచర్ ఉంది. ఇండియా–యూఎస్ సహజ భాగస్వాములు. ఇండియాలో ట్రేడ్ అవకాశాలు పెరిగాయంటే అవి నమ్మదగిన దేశంలో ఉన్నాయనే అర్థం’ అని మోడీ పేర్కొన్నారు.