- 40 నుంచి 50 మందితో సెకండ్ లిస్ట్ రిలీజ్ చేసే చాన్స్
న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ అభ్యర్థుల సెకండ్ లిస్ట్ రిలీజ్కు సంబంధించి ఈ నెల 21న కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ భేటీ కానుంది. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో జరగనున్న ఈ భేటీలో రాహుల్ గాంధీ, పీసీసీ చీఫ్ రేవంత్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్, ఇతర ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఈ భేటీ అనంతరం దాదాపు 40 నుంచి 50 మందితో సెంకడ్ లిస్ట్ రిలీజ్ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 18 లోపే లెఫ్ట్ పార్టీలకు కేటాయించే సీట్లు మినహా అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించాలని హైకమాండ్ యోచించింది.
కానీ, 18 నుంచి 20 వరకు అగ్రనేతలు రాహుల్, ప్రియాంక తెలంగాణ టూర్ దృష్ట్యా ఆ ఆలోచనను విరమించుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. టికెట్లు దక్కని వారి నుంచి అగ్రనేతలకు నిరసనలు ఎదురయ్యే చాన్స్ ఉంటుందని, పార్టీ ప్రచార స్పీడ్కు బ్రేక్ పడొచ్చని భావించినట్లు సమాచారం.