
- సీపీ స్థాయి అధికారిని చీఫ్గా నియమించే యోచనలో ప్రభుత్వం
- ప్రణీత్ రావు విచారణలో బయటపడుతున్న గత సర్కార్ అక్రమాలు
- వరంగల్లోని మాజీ మంత్రి ఆధ్వర్యంలో ఆపరేషన్
- ఒకే సామాజిక వర్గానికి చెందిన 28 మంది పోలీసులతో టీమ్
- లాగర్ రూమ్ నుంచే వార్ రూమ్స్కు కీలక డేటా
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన ఎస్ఐబీ అధికారులను గుర్తించి చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. అపోజిషన్ పార్టీ లీడర్లు, మీడియా ప్రముఖులు, పౌర హక్కుల నేతలు, ఇతర వ్యక్తుల ఫోన్ కాల్స్ వినడం, రికార్డ్ చేయడంపై దర్యాప్తునకు ఆదేశించింది. దీని కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేయనుంది. పోలీస్ కమిషనర్ స్థాయి అధికారిని సిట్ చీఫ్గా డీసీపీ, ఇద్దరు ఏసీపీలు, నలుగురు ఇన్స్పెక్టర్స్ సభ్యులుగా ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును మంగళవారం రాత్రే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో ఉంచి సీపీ, డీసీపీ ఆధ్వర్యంలో అతన్ని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ప్రణీత్ రావు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి సహకారంతో ఎస్ఐబీలో కీలక విభాగంలో చేరినట్లు సమాచారం. ఒకే సామాజిక వర్గానికి చెందిన పోలీస్ అధికారులతో సదరు మాజీ మంత్రి వరంగల్లో వార్ రూమ్ ఆపరేట్ చేసినట్లు తెలిసింది.
దీంతో పాటు హైదరాబాద్లోని గ్రీన్ల్యాండ్స్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లో సీక్రెట్ వార్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బేగంపేటలోని ఎస్ఐబీ ఆఫీస్, ప్రణీత్ రావు, ఆయన కుటుంబ సభ్యుల కాల్డేటా ఆధారంగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎస్ఐబీలో చేరిన నాటి నుంచి ప్రణీత్ రావు నిర్వహించిన విధులు సహా ఆయనకు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలకు సంబంధించిన డేటాను కూడా సేకరిస్తున్నట్లు సమాచారం. ప్రణీత్ రావు అందించే వివరాల ఆధారంగా మరికొంత మంది ఎస్ఐబీ అధికారులను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆరు జిల్లాల్లో సీక్రెట్ వార్ రూమ్స్
ఎస్ఐబీ లాగర్ రూమ్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కోసం వార్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వరంగల్ జిల్లాకు చెందిన సదరు మాజీ మంత్రి.. గత ఎన్నికల్లో తన ప్రత్యర్థికి సంబంధించిన రహస్య సమాచారం ప్రణీత్ రావు టీమ్ ద్వారా తెలుసుకునేవాడని తెలిసింది. లాగర్ రూమ్ నుంచి సేకరించిన డేటా, ఫోన్ కన్వర్జేషన్ను ప్రణీత్ రావు.. వరంగల్లోని వార్ రూమ్కు చేరవేసేవాడని సమాచారం. ప్రత్యర్థుల కాల్స్ ఆధారంగా మాజీ మంత్రి వ్యవహరించేవాడని, వాళ్లకు సంబంధించిన డబ్బులు తరలించేటప్పుడు సీజ్ చేయించేవాడని సమాచారం.
లాగర్ రూమ్ నుంచి వార్ రూమ్స్కు డేటా
వరంగల్లోని మాజీ మంత్రికి స్థానిక విజిలెన్స్ అధికారి, ఓ ఇన్స్పెక్టర్ సహకారం అందించినట్లు తెలిసింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన దాదాపు 28 మంది పోలీసులతో కలిపి సీక్రెట్ వార్ రూమ్ ఆపరేట్ చేసినట్లు సమాచారం. ఎస్ఐబీ లాగర్ రూమ్ నుంచే కీలక డేటా అన్ని జిల్లాల్లోని వార్ రూమ్స్కు వెళ్లేదని తేలింది. ప్రత్యర్థులు మాట్లాడుకున్నది విని.. ఆయా పోలీస్ స్టేషన్స్లో పని చేసే అధికారులకు సమాచారం వెళ్లేది. అప్పుడు లోకల్ పోలీసులు రంగంలోకి దిగి దాడులు చేసేవారనే ఆరోపణలు ఉన్నాయి.
ఫోన్ ట్యాపింగ్ వ్యాపారవేత్త కంప్లైంట్
ప్రతిపక్ష నేతలతో పాటు వ్యాపారవేత్తలు, రియల్టర్ల ఫోన్స్ కాల్స్ను కూడా ట్యాప్ చేసినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతను కలిసిన పలువురు వ్యాపారులను బెదిరించినట్టు తెలిసింది. వారి వద్ద నుంచి విరాళాల పేరుతో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ బుధవారం పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. తనతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు ఫిర్యాదు చేశాడు. గత ప్రభుత్వంలోని కొందరు మంత్రుల అండదండలతో పోలీసులు తనపై 40 అక్రమ కేసులు బనాయించారని తెలిపాడు. తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని వివరించాడు. ప్రణీత్ రావుతో మాజీ ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభాకర్ రావు, భుజంగ రావు, రవీందర్ రావుపై చర్యలు తీసుకోవాలని కోరాడు.
ప్రణీత్ రావుకు 14 రోజుల రిమాండ్
వైద్య పరీక్షల అనంతరం ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును మేడ్చల్ కొంపల్లిలో నివాసం ఉంటున్న నాంపల్లి 14వ అడిషనల్ చీఫ్ మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ కన్నయ్యలా ల్ ఎదుట బుధవారం హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్ట్ను పరిశీలించిన అనం తరం.. ప్రణీత్ రావుకు 14 రోజుల జ్యుడీషి యల్ రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. దీంతో అతన్ని చంచల్గూడ జైలుకు తరలించారు. ప్రణీత్ రావును వారం రోజుల పాటు విచారించేందుకు కస్టడీ కోరుతూ గురువారం పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.