
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అదే జోష్తో లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నది. 15 స్థానాల్లో గెలిచేలా టార్గెట్నూ ఫిక్స్ చేసుకుంది. ఈసారి సోనియా గాంధీని రాష్ట్రం నుంచి పోటీ చేయించాలని నిశ్చయించుకున్నారు. మరోవైపు, పార్టీకి అభ్యర్థుల విషయంలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ తెలంగాణలోని లోక్సభ స్థానాల్లో ఇద్దరు చొప్పున అభ్యర్థులు రేసులో ఉండగా.. ఉత్తర తెలంగాణలోని కొన్ని చోట్ల సరైన అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితులున్నాయి. సిట్టింగ్ ఎంపీలు పదవులకు రాజీనామా చేసి సీఎం, మంత్రుల హోదాల్లో ఉండడంతో వారి స్థానాల్లో ఎవరు బరిలో నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, సామాజిక సమీకరణాలు, గెలుపు గుర్రాలను దృష్టిలో పెట్టుకుని టికెట్ల కేటాయింపు ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఆదిలాబాద్లో అభ్యర్థి కరువు..
ఆదిలాబాద్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సరైన అభ్యర్థి లేరు. ఇప్పుడు ఆ సీటును ఎవరికిస్తారన్నదానిపై చర్చ జరుగుతున్నది. పెద్దపల్లి నుంచి గతంలో పోటీచేసిన ఎ. చంద్రశేఖర్ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో ఆ స్థానం నుంచి వివేక్ వెంకట స్వామి కుమారుడు వంశీకృష్ణ పోటీలో ఉన్నట్టుగా చర్చ జరుగుతున్నది. గత ఎన్నికల్లో జహీరాబాద్ నుం చి పోటీచేసిన మదన్మోహన్ రావు ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ స్థానం నుంచి సురేశ్ షెట్కార్ బరిలో నిలిచే చాన్స్ ఉంది. మహబూబాబాద్ నుంచి గతంలో పోటీ చేసిన బలరాం నాయక్.. మళ్లీ రేసులో ఉన్నట్టు సమాచారం. అయితే, తనకు ఎమ్మెల్యే టికెట్ నిరాకరించిన హైకమాండ్ మహబూబాబాద్ ఎంపీ టికెట్ఇస్తామని హామీ ఇచ్చిందంటూ బెల్లయ్య నాయక్ చెప్తున్నారు. సికింద్రాబాద్ నుంచి గతంలో పోటీ చేసిన అంజన్ కుమార్యాదవ్కే ఇస్తారా.. లేదా ఆయన కొడుడు అనిల్ కుమార్ యాదవ్కు ఇస్తారా అన్న చర్చ జరుగుతున్నది. వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య గతంలో పోటీ చేయగా.. ఇప్పుడు మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి అభ్యర్థిత్వాన్ని కూడా పార్టీ పరిశీలించే అవకాశాలున్నట్టుగా తెలుస్తున్నది.
సోనియా పోటీ చేస్తే గెలుపుపై ప్రభావం
ఈసారి సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలని పార్టీ రాష్ట్ర నేతలు నిర్ణయించారు. గతంలో ఇందిరా గాంధీ పోటీ చేసిన మెదక్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్నగర్ నియోజకవర్గాలను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఒకవేళ ఆమెకు ఇష్టం లేకుంటే ప్రియాంక గాంధీతోనైనా పోటీ చేయించాలని పార్టీ నేతలు భావిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారన్న విషయాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నేతలు ప్రజల్లోకి గట్టిగానే తీసుకెళ్లగలిగారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన ఆమెనే నేరుగా మన రాష్ట్రంలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే పార్టీ గెలుపును ప్రభావితం చేస్తారని పార్టీ నేతలు భావిస్తున్నట్టుగా సమాచారం
మల్కాజ్గిరి సీటుపై ఆసక్తి?
సీఎం రేవంత్ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి నుంచి ఎవరు పోటీ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఆ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హన్మంతరావు పేరు ప్రముఖంగా వినిపిస్తున్నది. అయితే, పార్టీ వర్గాలు మాత్రం ఆయన ఫ్యామిలీలో ఇప్పటికే ఇద్దరికి టికెట్లు ఇచ్చారని, ఎమ్మెల్యేగా మైనంపల్లి ఓడిపోయారని అంటున్నాయి. ఆయన స్థానంలో వేరే నేతకు కేటాయించాలని అంటున్నారు.