
- రాష్ట్ర మంత్రి మండలిలో నాలుగో వంతు దళితులు
- ఎస్సీలకు ఈ స్థాయి గుర్తింపు ఇదే మొదటిసారి
- కాంగ్రెస్లో సామాజిక న్యాయానికి ఇదే నిదర్శనమంటున్న నేతలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర కేబినెట్ తాజా విస్తరణతో ఎస్సీ మంత్రుల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ నలుగురిలో ఇద్దరు మాల, ఇద్దరు మాదిగ సామాజిక వర్గాలకు చెందినవారు ఉన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎస్సీ మాల, హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ఎస్సీ మాదిగ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. తాజాగా మాల సామాజిక వర్గానికి చెందిన వివేక్ వెంకటస్వామి, మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో చోటు దక్కింది. ఉమ్మడి ఏపీలో చూసినా, తెలంగాణలో చూసినా మంత్రివర్గంలో దళితుల వాటా 26 శాతం ఉండడం ఇదే మొదటిసారి అని, కాంగ్రెస్లో సామాజిక న్యాయానికి ఇదే నిదర్శనమని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు.
కీలకమైన స్పీకర్ పదవి కూడా..
తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగా, కేసీఆర్ కేబినెట్ లో తాటికొండ రాజయ్యకు మంత్రిమండలిలో స్థానం కల్పించి, డిప్యూటీ సీఎంగా నియమించారు. ఆ తర్వాత కొన్ని కారణాలతో ఆయన్ను తప్పించి ఆ స్థానంలో కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చారు. అంటే తెలంగాణ మొదటి కేబినెట్ లో కేవలం ఒకే ఒక ఎస్సీకి చోటు దక్కినట్లయింది. ఇక 2018లో రెండోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేబినెట్లో కేసీఆర్ ఇద్దరు ఎస్సీలకు చోటు కల్పించారు. ఇందులో కడియం శ్రీహరి, కొప్పుల ఈశ్వర్ ఉన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి కేబినెట్లో డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కకు, వైద్యశాఖ మంత్రిగా దామోదర రాజనర్సింహాకు చాన్స్ ఇచ్చారు. ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు చోటు కల్పించారు. దీంతో తెలంగాణ కేబినెట్ లో దళితుల వాటా 26.66 శాతానికి చేరింది. ఇలా రాష్ట్ర మంత్రి మండలిలో ఒకేసారి నలుగురు దళితులు ఉండడం తెలంగాణ చరిత్రలో ఇదే ప్రథమం. ఈ ఘనత సాధించిన పార్టీగా కాంగ్రెస్ కు ప్రత్యేక గుర్తింపు దక్కింది. కీలకమైన స్పీకర్పదవి కూడా ఎస్సీ(మాల) సామజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్కుమార్కు ఇవ్వడం మరో విశేషం.