హైదరాబాద్, వెలుగు: కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎన్ని బూతులు మాట్లాడారో అప్పుడే మర్చిపోయారా అని కాంగ్రెస్ నేత మృత్యుంజయం ప్రశ్నించారు. కేసీఆర్ మాటలకు అడ్డూ, అదుపు లేకుండా పోయిందని తెలిపారు. బుధ వారం గాంధీ భవన్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఒంటి మీద గీత పడకుండా చూసుకుంటానని చెప్పిన కేసీఆర్.. ఎంతో మంది చావులకు కారణమయ్యాడని ఆరోపించారు.
మహిళలకు కాంగ్రెస్ ఉచిత ప్రయాణం కల్పిస్తే బీఆర్ఎస్ నేతలు ఆటో కార్మికులను రెచ్చగొడ్తున్నారని మండిపడ్డారు. వారి పాలనలో 3,500 డబుల్ బెడ్రూం ఇండ్లు కూడా ఇవ్వలేదని, ఇచ్చిన ఇండ్లను కూడా బీఆర్ఎస్ కార్యకర్తలే అమ్ముకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడత ప్రతి సెగ్మెంట్కు 3,500 ఇండ్లను కేటాయించిందని పేర్కొన్నారు. కమీషన్లకు ఆశపడి బతుకమ్మ చీరలను బయటి రాష్ట్రాల నుంచి తెప్పించారన్నారు. కేసీఆర్ లాంటి దొంగలు తెలంగాణకు అవసరం లేదన్నారు.