
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు పార్టీ హైకమాండ్ నుంచి పిలుపొచ్చింది. ఆదివారం సాయంత్రం పార్టీ ముఖ్య నేతలంతా ఢిల్లీకి వెళ్లనున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన నేతలు పార్టీ పెద్దలతో భేటీ కానున్నారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఢిల్లీలోనే ఉన్నారు. బీఆర్ఎస్బహిష్కృత నేతలు పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సోమవారం రాహుల్ గాంధీతో భేటీ కానున్నట్లు తెలుస్తున్నది.
సీనియర్ల ఇంటికెళ్లిన ఠాక్రే
పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీ మారుతున్నట్లు వస్తున్న కథనాల నేపథ్యంలో హైకమాండ్ అలర్ట్ అయినట్టు తెలుస్తున్నది. ఈ క్రమంలోనే సీని యర్ల ఇండ్లకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే వెళ్లి సమావేశమయ్యారు. మాజీ మంత్రి జానా రెడ్డి, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డితో ఆయన చర్చలు జరిపారు. అయితే, తాను పార్టీ మారాలనుకోవట్లేదని ఠాక్రేకి ఉత్తమ్ స్పష్టం చేసినట్టు సమాచారం. తనపై కూడా తప్పుడు కథనాలను ప్రసారం చేస్తున్నారని జానారెడ్డి అన్నట్లు తెలిసింది.
రేవంత్ సమక్షంలో చేరికలు
శనివారం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్, బీజేపీకి చెందిన పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అచ్చంపేట, వనపర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు రేవంత్ ఇంట్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.