
కోల్బెల్ట్, వెలుగు: క్యాతనపల్లి మున్సిపాలిటీలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ లీడర్లు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఒడ్నాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో లీడర్లు బుధవారం హైదరాబాద్లో ఎమ్మెల్యేను కలిశారు. రామకృష్ణాపూర్లో 50 పడకల ఆస్పత్రి ఏర్పాటు, వీధి వ్యాపారులు బిజినెస్ చేసుకోవడానికి స్థలం కేటాయింపు, రామకృష్ణాపూర్లోని అబ్రహంనగర్లో జనవాసాల ప్రాంతం మీదుగా వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైన్లు తొలగించేందుకు కృషి చేయాలని కోరారు.
రామకృష్ణాపూర్ మీదుగా మంచిర్యాల–మందమర్రి ఆర్టీసీ బస్సు పునరుద్ధరణ, బీజోన్ సెంటర్ నుంచి కనకదుర్గ కాలనీ వరకు బీటీరోడ్డు నిర్మాణం, సింగరేణి ఏరియా ఆస్పత్రిలో కార్మికేతరులకు వైద్య సేవలు కల్పించేలా సింగరేణి యాజమాన్యం నుంచి జీవో జారీ చేయించాలని ఎమ్మెల్యేను కోరారు.