- రామ్లీలా మైదానంలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు..
- హాజరుకానున్న పార్టీ అగ్రనేతలు ఖర్గే, రాహుల్, ప్రియాంక
- తెలంగాణ నుంచి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, మంత్రులు
న్యూఢిల్లీ, వెలుగు: ఓటు చోరీపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇందుకోసం ఢిల్లీ వేదికగా మహాధర్నా నిర్వహించనుంది. ఆదివారం ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసన కార్యక్రమం చేపట్టనుంది. ఇందులో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, ఇతర కీలక నేతలు పాల్గొననున్నారు.
అలాగే, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుంచి సీఎంలు, మంత్రులతో పాటు అన్ని రాష్ట్రాల నుంచి పీసీసీ చీఫ్లు, ముఖ్య నేతలు హాజరుకానున్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, స్టేట్ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నేతలు పాల్గొననున్నారు. ధర్నాలో పాల్గొనేందుకు ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీకి చేరుకున్నాయి. కాగా, ఇటీవల ఎర్రకోట దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
