ధర్నా చౌక్‌ను ఊడ్చి.. శానిటైజ్‌ చేసిన కాంగ్రెస్

ధర్నా చౌక్‌ను ఊడ్చి.. శానిటైజ్‌ చేసిన కాంగ్రెస్

ముషీరాబాద్ (హైదరాబాద్), వెలుగు: రాజధానిలో ఇందిరా పార్కు దగ్గర ధర్నా చౌక్ ప్రాంతాన్ని కాంగ్రెస్, ఓయూ జేఏసీ నేతలు శుక్రవారం ఊడ్చి శానిటైజ్‌ చేశారు. టీఆర్ఎస్ నేతల ధర్నాతో చౌక్ అపవిత్రమైందన్నారు. దీక్షా ప్రాంగణానికి పట్టిన గులాబీ చీడ ఏరివేతకు క్రిమి సంహారక మందు చల్లామని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కోటూరి మానవతారాయ్ అన్నారు. ధర్నా చౌక్ వద్ద శుక్రవారం ఉదయం టీఆర్ఎస్ ధర్నా చేయగా, సాయంత్రం కాంగ్రెస్, ఓయూ జేఏసీ, నిరుద్యోగ జేఏసీ నేతలు ఆ ప్రాంతాన్ని ఊడ్చి నిరసన తెలిపారు. యాసంగిలో వరి వేయొద్దని టీఆర్ఎస్, బీజేపీ రైతుల్ని బెదిరించి దొంగ నాటకాలు ఆడుతున్నాయని మానవతారాయ్ విమర్శించారు. నిషేధించిన ధర్నా చౌక్ లోనే ధర్నాకు దిగేంతగా టీఆర్ఎస్ దిగజారిందన్నారు.