మేనిఫెస్టో తయారీలో అన్ని వర్గాల అభిప్రాయాలను తీసుకున్నామని తెలిపారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఏడాది నుంచి మేనిఫెస్టో తయారీకి పనిచేస్తున్నామన్నారు. ఢిల్లీలో ఇవాళ ( మంగళవారం) హమ్ నిభాయేంగే పేరుతో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. రాహుల్… అధ్యక్ష హోదాలో తొలిసారిగా మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో ఉంటుందన్నారు రాహుల్. సంక్షేమంతో సంపద సృష్టించడమే లక్ష్యమని.. ఉద్యోగ కల్పన, రైతు సమస్యలే ప్రధాన అజెండా అని అన్నారు.
ఐదు ప్రధాన అంశాలపై దృష్టిసారించామన్నారు. పేదరికంపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్నారు. ఐదేళ్లలో పేదలకు రూ.3 లక్షల 60వేలు ఇస్తామని, యువతకు ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. వ్యాపారాలు ప్రారంభించేందుకు మూడేళ్ల వరకు అనుమతులు అవసరం లేదన్నారు. రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెడతామని…అవి వారికోసమే ఖర్చు చేస్తామన్నారు. రైతులు రుణాలు చెల్లించకపోతే క్రిమినల్ నేరంగా పరిగణించబోమని, ఉపాధి హామీని పథకాన్ని 100 రోజుల నుంచి 150 రోజులకు విస్తరిస్తామన్నారు. న్యాయ్ స్కీమ్తో పేదలకు కనీస ఆదాయం కల్పిస్తామన్నారు.దేశవ్యాప్తంగా ఐదు కోట్ల నిరుపేద కుటుంబాలకు ఏటా రూ 72,000 కోట్ల నగదు సాయం అందిస్తామన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి 6శాతం నిధులు కేటాయిస్తామని, పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తామన్నారు రాహుల్.
అంతేకాదు ఆర్ధిక నేరస్థులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు..బ్యాంకు రుణాలు ఎగ్గొట్టేవారిని జైలుకు పంపిస్తామన్నారు. దేశ భద్రత విషయంతో రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. రాఫెల్ డీల్ విషయంలో ప్రధాని అబద్దాలు చెబుతున్నారన్నారు. 2020 వరకు 22 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు రాహుల్.
