అక్టోబర్ 28 నుంచి కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర

అక్టోబర్ 28 నుంచి కాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఓవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తూనే, జాతీయ స్థాయి నాయకులతో భారీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. గురువారం నుంచి వరుసగా ఇంటింటి ప్రచారం, రెండో విడత బస్సు యాత్ర నిర్వహించేందుకు ప్లాన్ సిద్ధం చేసింది. 26, 27న ఇంటింటి ప్రచారం, 28 నుంచి‌‌‌‌‌‌‌‌ వచ్చే నెల ఒకటో తేదీ వరకు బస్సు యాత్ర చేపట్టనుంది. రెండో విడత బస్సు యాత్రకు హైకమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇందులో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొననున్నారు. ఉమ్మడి మహబూబ్​నగర్, మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో బస్సు యాత్రను నిర్వహించేలా పార్టీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు. రేపటి లోపు అధికారికంగా షెడ్యూల్ కూడా విడుదల చేయనున్నట్లు సీనియర్ నేత ఒకరు చెప్పారు. కాగా 28, 29 తేదీలలో కర్నాటక సీఎం సిద్ధరామయ్య.. 30, 31 తేదీలలో ప్రియాంక గాంధీ.. వచ్చే నెల 1న రాహుల్ గాంధీ బస్సు యాత్రలో పాల్గొననున్నారు. 

బహిరంగ సభలు సైతం.. 

తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగానే తొలుత ఖమ్మం, వరంగల్, హైదరాబాద్ పై ఫోకస్ పెట్టి సభలు, సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు కవర్ అయ్యేలా బస్సు యాత్రను పూర్తి చేశారు. ఇప్పుడు రంగారెడ్డి, మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాత్ర నిర్వహించనున్నారు. ఈ నాలుగు జిల్లాల్లో బస్సు యాత్రతో పాటు కొన్నిచోట్ల బహిరంగ సభలను కూడా నిర్వహించేందుకు పార్టీ కసరత్తు చేస్తున్నది.

రెండ్రోజులు ఇంటింటి ప్రచారం

బస్సు యాత్రకు ముందు కాంగ్రెస్ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 26, 27 తేదీలలో ఇంటింటికీ వెళ్లనున్నారు. 26న ఉమ్మడి వరంగల్, నల్గొండ, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో పర్యటించనున్నారు. 27న ఉమ్మడి రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్‌‌‌‌‌‌‌‌లో ప్రచారం చేయనున్నారు. ఈ రెండు రోజుల్లో 40 నియోజకవర్గాల్లో ఇంటింటి ప్రచారం చేయనున్నారు. 10 మంది నేతలు రోజుకు రెండు నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తారు. ఈ క్యాంపెయిన్ లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ మాణిక్ రావు ఠాక్రే, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు, మధుయాష్కీ, సీతక్క తదితరులు పాల్గొననున్నారు.