నల్గొండలో 12 స్థానాల్లో గెలుస్తం: కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

నల్గొండలో  12 స్థానాల్లో గెలుస్తం: కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

హైదరాబాద్​, వెలుగు: నల్గొండ జిల్లాలోని 12కు 12 స్థానాల్లో కాంగ్రెస్​ పార్టీనే గెలుస్తుందని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ పార్టీ ఉన్నది నాయకుల కోసం కాదని, 4 కోట్ల మంది ప్రజల కోసమని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్​లోని తన ఇంటి వద్ద కుంభం అనిల్​ కుమార్​ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. పోలింగ్​కు కేవలం 32 రోజుల టైమే ఉందని.. ప్రతి గ్రామంలోనూ ప్రచారం చేస్తామని తెలిపారు. 

ఒక్కసారి కాంగ్రెస్​కు ఓటేసి గెలిపించాలని ప్రజలను కోరారు. రాష్ట్ర ఏర్పాటు కోసం మంత్రి పదవిని వదులుకున్నానని, నిరాహార దీక్ష చేశానని తెలిపారు. కేసీఆర్​లా గ్లూకోజ్​నిరాహార దీక్ష చేయలేదని, హరీశ్​రావులా పెట్రోల్​ పోసుకుని దొంగ బెదిరింపులకు పాల్పడలేదని చెప్పారు. భువనగిరిలో 40 ఏండ్ల చరిత్రను తిరగరాయాలన్నారు. విభేదాలను పక్కనపెట్టి కార్యకర్తలంతా కుంభం అనిల్​ కుమార్​ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

 తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీయేనని ఆనాడు ఆమె కాళ్లు మొక్కిన కేసీఆర్.. ఇప్పుడు కాంగ్రెస్​ గ్యారంటీ లేని పార్టీ అని అంటున్నారని విమర్శించారు. కేసీఆర్​ బంధువులు కూడా బీఆర్ఎస్​ను నమ్మకుండా కాంగ్రెస్​లో చేరుతున్నారని వెల్లడించారు. కాంగ్రెస్​ హయాంలో కట్టిన ఏ ఒక్క ప్రాజెక్టుకూ చిన్న గీత కూడా పడలేదని, కానీ కేసీఆర్​కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు మూడేండ్లకే దెబ్బతింటున్నదని వెంకట్  రెడ్డి పేర్కొన్నారు.