మోతె, వెలుగు: ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ ను అడ్డుకున్న కానిస్టేబుల్ పై డ్రైవర్ దాడి చేసి ట్రాక్టర్తో సహా పారిపోయాడు. సూర్యాపేట జిల్లా, మోతే మండలం కూడలి గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. అక్రమ ఇసుక రవాణాను అరికట్టడానికి మోతే తహసీల్దార్ తో పాటు ఎస్ఐ అజయ్ కుమార్ కూడలి గ్రామ శివారులోని వాగు వద్ద పికెట్ ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి మోతే పోలీస్ కానిస్టేబుల్ కృష్ణం రాజు, కూడలి జీపీఓ సుధాకర్ పికెట్ డ్యూటీ చేస్తున్నారు. రాత్రి 8 గంటలకు కాకరవాయి నుంచి కూడలి వైపు వస్తున్న ఇసుక ట్రాక్టర్ ను కానిస్టేబుల్ ఆపే ప్రయత్నం చేశారు.
డ్రైవరు ట్రాక్టర్ ఆపకుండా వేగంగా వెళ్లగా.. కానిస్టేబుల్ బైక్ తో వెంబడించి పట్టుకున్నాడు. అనుమతులు లేకపోవడంతో ట్రాక్టర్ను పీఎస్కు తరలించాలని చెప్పాడు. ట్రాక్టర్ డ్రైవర్భూక్యా మధు, భూక్యా శ్రీకాంత్ కానిస్టేబుల్ కృష్ణంరాజుపై దాడి చేసి కొట్టి.. ట్రాక్టర్ తో సహా పారిపోయారు. ఎస్ఐ అజయ్ కుమార్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

