
- బోర్డు అనుమతితోనే వీరి నియామకాలు జరిగాయన్న సంస్థ
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ అభివృద్ధి కోసమే సంస్థలో కన్సల్టెంట్లను టెంపరరీగా నియమించుకున్నామని ఆర్టీసీ తెలిపింది. ‘ఆర్టీసీలో ప్రైవేట్ వ్యక్తుల హవా’అనే శీర్షికతో ‘వెలుగు’దినపత్రికలో వచ్చిన వార్త కథనంపై సోమవారం ఒక ప్రకటనలో సంస్థ వివరణ ఇచ్చింది. ఆర్టీసీలో ప్రైవేట్ వ్యక్తులను నియమించి కోట్ల రూపాయలు చెల్లిస్తున్నా రన్నది నిజం కాదని తెలిపింది.
ఆర్టీసీలో బస్ ఆపరేషన్స్, ఐటీ, అకౌంట్స్ విభాగాలను సమన్వయం చేస్తూ సంస్థ డెవలప్మెంట్కు అనుభవం ఉన్న వారిని కన్సల్టెంట్లుగా నియమించుకునే అధికారం తమకు ఉందని ఆర్టీసీ పేర్కొంది. గత 13 ఏండ్లుగా ఆర్టీసీలో అధికారులు, సూపర్వైజర్లు పెద్ద ఎత్తున రిటైర్ అయ్యారని, దీంతో పలు నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు వస్తున్నాయని తెలిపింది. సంస్థలో ఏ నియామకం అయినా రూల్స్ ప్రకారమే, బోర్డు ఆమోదంతోనే జరుగుతుందని స్పష్టం చేసింది.