కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి సింగరేణి ఏరియాలో కాంట్రాక్ట్ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న గార్డులు తమకు విధులు కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సింగరేణి జీఎం ఆఫీస్ ఎదుట నిరసనకు దిగారు. వారు మాట్లాడుతూ సింగరేణి ఎస్అండ్పీసీ డిపార్ట్మెంట్ కాంట్రాక్ట్ సెక్యూరిటీ విభాగంలో పదేండ్లుగా 213 మంది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు పనిచేస్తున్నారని, గత కాంట్రాక్ట్ కంపెనీ వీపీ వర్గీస్కు సెక్యూరిటీ టెండర్ కాలపరిమితి ముగిసిందన్నారు.
దీంతో తమకు డ్యూటీలు నిలిపివేశారన్నారు. కొత్త టెండర్ వచ్చినప్పటికీ ఇంకా అమలు చేయకపోవడంతో వందలాది మంది గార్డులకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. సింగరేణి యాజమాన్యం వెంటనే కొత్త టెండర్ అమలు చేస్తూ తమకు డ్యూటీలు కల్పించాలని డిమాండ్ చేశారు.
