అగ్రికల్చర్ ఆఫీసర్‌‌‌‌ ను బెదిరించి రూ.1.30 లక్షలు వసూల్‌‌.. ఇద్దరు సోషల్ మీడియా జర్నలిస్టుల అరెస్ట్

అగ్రికల్చర్ ఆఫీసర్‌‌‌‌ ను బెదిరించి రూ.1.30 లక్షలు వసూల్‌‌.. ఇద్దరు సోషల్ మీడియా జర్నలిస్టుల అరెస్ట్

ఆసిఫాబాద్, వెలుగు: అగ్రికల్చర్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌ను బెదిరించి రూ.1.30లక్షలు వసూలు చేసిన ఇద్దరు సోషల్​మీడియా జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆసిఫాబాద్ డీఎస్పీ బి.అశోక్ శనివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. 

దహెగాం మండలానికి చెందిన బుతే దేవేందర్(మెదక్​టుడే), డుప్త సురేశ్‌‌(సూరన్న టీవీ) ముఠాగా ఏర్పడి అధికారులను బెదిరించి వసూళ్లకు పాల్పడేవారు. ఈ క్రమంలో వ్యవసాయ శాఖను టార్గెట్ చేసి కొన్ని రోజుల కింద వీడియోలు ప్రచారం చేశారు. 

దేవేందర్‌‌‌‌కు అదే మండలానికి చెందిన రాధిక ట్రేడర్స్ యజమానితో విభేదాలున్నాయి. దీంతో అతని షాపును మూసివేసేందుకు సురేశ్‌‌తో కలిసి వ్యవసాయ అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయితే ఆ దుకాణానికి లైసెన్సులు, రికార్డులు సక్రమంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో వారు ఫోన్ కాల్స్, వీడియోలు, సోషల్ మీడియా పోస్టుల ద్వారా జిల్లా వ్యవసాయ అధికారి వెంకటిని బెదిరించి రూ.20లక్షలు డబ్బులు డిమాండ్ చేశారు. 

ఈ క్రమంలో జూలై 26న రూ.1.30 లక్షలు తీసుకున్నారు. అనంతరం ఆఫీసర్‌‌‌‌ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం హైదరాబాద్‌‌లో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఆసిఫాబాద్‌‌కు తరలించినట్లు పేర్కొన్నారు. సురేశ్‌‌ గతంలోనే ఓ పోక్సో కేసులో బాలిక వివరాలు, వీడియోలను సోషల్ మీడియాలో బహిర్గతం చేసిన ఆరోపణలపై కేసు నమోదై విచారణలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.