
హైదరాబాద్ : నగరానికి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ కంట్రోల్ఎస్ 2021 నాటికి 50 లక్షల చదరపు అడుగుల టైర్–4 డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది. దీంతో ఇది డేటా వినియోగంలో వృద్ధికి దోహదం చేయడమే కాకుండా.. డేటా స్థానికత నిబంధనలకు ఉపయోగపడనుంది. ఆరు నెలల క్రితమే కంట్రోల్ఎస్ 40 లక్షల చదరపు అడుగుల టైర్–4 డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. వాటిలో 20 లక్షల చదరపు అడుగుల హైపర్స్కేల్ డేటా సెంటర్ను హైదరాబాద్లో, 10 లక్షల చదరపు అడుగుల డేటా సెంటర్లను ఒకటి ముంబైలో, మరొకటి చెన్నైలో నెలకొల్పుతామని తెలిపింది. ముంబైలో మరో 10 లక్షల చదరపు అడుగుల డేటా సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు కంట్రోల్ఎస్ మంగళవారం ప్రకటించింది. కంపెనీ క్లయింట్స్గా ఫ్లిప్కార్ట్, ఎస్బీఐ, అదానీ గ్రూప్, వొడాఫోన్ వంటివి ఉన్నాయి. ‘హైపర్స్కేల్ కెపాసిటీలపై కంట్రోల్ఎస్ పెట్టుబడులు పెడుతోంది. 2021 నాటికి 50 లక్షల చదరపు అడుగుల ఫుట్ప్రింట్తో గ్లోబల్గా అతిపెద్ద డేటా–4 సెంటర్ ప్లేయర్గా అవతరించనున్నాం’ అని కంట్రోల్ఎస్ డేటా సెంటర్స్ సీఈవో, వ్యవస్థాపకుడు శ్రీధర్ పిన్నపురెడ్డి అన్నారు. సోషల్ మీడియా, క్లౌడ్, ఈకామర్స్, డిజిటైజేషన్ ఆఫ్ డేటా, ఐఓటీ వంటి వాటితో డేటా క్రియేట్ అవుతుందని, దీని కోసం ఇండియాలో పెద్ద మొత్తంలో కెపాసిటీస్ అవసరమని చెప్పారు. ఈ అవకాశాన్ని కంట్రోల్ఎస్ అందిపుచ్చుకుంటున్నట్టు పేర్కొన్నారు.