లోక్​సభ ఎన్నికల వేళ మావోయిస్టులపై పోలీస్​ నిఘా

లోక్​సభ ఎన్నికల వేళ మావోయిస్టులపై పోలీస్​ నిఘా
  • జైపూర్​ఎస్టీపీపీ గెస్ట్​హౌస్​లో తెలంగాణ, మహారాష్ర్ట పోలీస్​ఆఫీసర్ల మీటింగ్​ 

మంచిర్యాల, వెలుగు : లోక్​సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణ, మహారాష్ర్ట సరిహద్దుల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్​ యంత్రాగం అప్రమత్తమైంది. శుక్రవారం మంచిర్యాల జిల్లా జైపూర్ సింగరేణి థర్మల్​పవర్​ప్లాంట్(ఎస్టీపీపీ) గెస్ట్​హౌస్​లో రెండు రాష్ర్టాల సరిహద్దు జిల్లాల పోలీస్​ అధికారులు భేటీ అయ్యారు.

రామగుండం పోలీస్​ కమిషనర్​ఎం.శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ అశోక్​కుమార్, జయశంకర్​భూపాలపల్లి అడిషనల్​ఎస్పీ (ఆపరేషన్స్​) ఎన్.భుజంగరావు, కుమ్రంభీమ్​ఆసిఫాబాద్​జిల్లా అడిషనల్​ఎస్పీ(అడ్మిన్​) ఆర్.ప్రభాకర్​రావు, మహారాష్ర్టలోని గడ్చిరోలి ఎస్పీ నీలోత్పాల్, అడిషనల్​ఎస్పీ (ఆపరేషన్స్​) యతీష్ దేశ్‌‌‌‌ముఖ్, అహేరి అడిషనల్​ఎస్పీ ఎం.రమేశ్, బెజాపూర్​ అడిషనల్​ఎస్పీ వైభవ్ బ్యాంకర్, అడిషనల్​ఎస్పీ(అడ్మిన్​) చంద్రకాంత్ తదితరులు సమావేశమయ్యారు.  మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సుదీర్ఘంగా చర్చించారు.

సరిహద్దు జిల్లాల పోలీస్​అధికారులు సమన్వయంతో పనిచేసి ఎన్నికలు సజావుగా సాగేలా కృషి చేయాలని చర్చించారు. మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచి సంబంధిత సమాచారాన్ని పరస్పరం పంచుకోవాలని నిర్ణయించారు. రామగుండం సీపీ శ్రీనివాస్​మాట్లాడుతూ రెండు రాష్ర్టాల సరిహద్దుల్లో చెక్​పోస్టులను ఏర్పాటు చేయడంతోపాటు మద్యం, డబ్బు అక్రమ రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో గ్రేహౌండ్స్​ ఓఎస్డీ దయానంద్, సిరొంచ ఎస్​డీవోపీ సందేశ్​నాయక్, నిర్మల్​ఎస్​డీవోపీ ఎ.గంగారెడ్డి, కాగజ్​నగర్​ఎస్​డీవోపీ ఎ.కరుణాకర్, రామగుండం స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, జైపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి ఏసీపీలు వెంకటేశ్వర్లు, ప్రకాశ్, రవికుమార్ పాల్గొన్నారు.