జోన్లు తగ్గినా.. కరోనా కేసులు పెరుగుతున్నయ్‌‌

జోన్లు తగ్గినా.. కరోనా కేసులు పెరుగుతున్నయ్‌‌

హైదరాబాద్, వెలుగు: కంటెయిన్​మెంట్ జోన్లలో కరోనా కంట్రోల్​ అవుతోందని ​అనుకుంటుండగానే, ఆ పక్కనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. మొదట్లో నిర్వహణ భారంగా మారిందని పరిధి తగ్గించి కొత్త జోన్లు ఏర్పాటు చేయగా, కేసులు సమీప ప్రాంతాలకు వేగంగా పాకుతున్నాయి. ఇప్పుడిదే బల్దియా వర్గాలను కలవరపెడుతోంది. ఓవైపు పాత జోన్ తొలగిస్తుంటే, మరోవైపు ఆ దగ్గర్లోనే పాజిటివ్​ కేసులు వస్తున్నాయి.

హైదరాబాద్‌‌లో కంటెయిన్​మెంట్​ జోన్లు169 నుంచి 96కి తగ్గాయి. మొదట్లో జోన్ల విస్తీర్ణం కిలోమీటర్ పరిధిలో ఉంది. సిబ్బంది కొరత, నిర్వహణ ఇబ్బందులతో కుదించారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఇంటికి 100–200మీటర్లలోపే చిన్న జోన్లు పెట్టారు. అలాంటివి169 ఏర్పాటయ్యాయి. కేసుల్లేని చోట జోన్లను తొలగిస్తున్నారు. పాజిటివ్ కేసులు నమోదవుతున్న చోట కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. పాత జోన్‌‌ పక్క ప్రాంతాల్లోనే కొత్తవి నమోదవుతుండడంతో ఏం చేయాలో అధికారులకు అర్థం కావడం లేదు.  మొదట్లో మలక్ పేట సర్కిల్ పరిధిలో కేసులు నమోదవగా సాద్ మసీద్, నల్గొండ సర్కిల్, ఫకీర్ గల్లీ, సాజీదాబాగ్ వంటి ప్రాంతాలను కలిపి కంటైన్ మెంట్ జోన్ ఏర్పాటుచేశారు. పరిధి ఎక్కువ ఉండడంతో మెయింటెనెన్స్​కష్టమని తగ్గించారు. ప్రొఫెసర్​ కాలనీ, మూసారాం బాగ్‌‌ ఏరియాలను తొలగించగా, తాజాగా కొత్త కేసులు అక్కడే వచ్చాయి. ఇప్పుడక్కడ మళ్లీ కంటెయిన్​మెంట్​పెట్టారు. ఈ పరిస్థితి కూకట్‌‌పల్లి, ఖైరతాబాద్ సర్కిళ్లలోనూ ఉంది. ప్రొఫెసర్ కాలనీలో మొదట్లో ఒక్క కేసూ లేదు. ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి మలక్ పేట గంజ్ లో వ్యాపారి. అక్కడ పనిచేసే హమాలీ నుంచి అతనికి కరోనా సోకింది. ప్రస్తుతమిక్కడ 10 మందికి పాజిటివ్ రావడంతో కింగ్ కోఠి హాస్పిటల్ లో ట్రీట్‌‌మెంట్‌‌ పొందుతున్నట్లు తెలిసింది.

దడపుట్టిస్తున్న చార్మినార్ జోన్

జీహెచ్ఎంసీ చార్మినార్ జోన్ పరిధిలోని మలక్ పేట, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్ నుమా, రాజేంద్రనగర్ సర్కిళ్లలో పాజిటివ్ కేసులు వచ్చాయి. కేసుల సంఖ్య 219కి చేరింది. ఇప్పటికే 50 కంటెయిన్​మెంట్ జోన్లు పెట్టారు.

 బారికేడ్లపైనే దృష్టి

కొత్త జోన్ల ఏర్పాటు, నిర్వహణపైనే ప్రధానంగా ఫోకస్‌‌ చేసిన బల్దియా..ఇప్పటికే ఏర్పాటైన జోన్లలోని జనాల అవసరాలపై పూర్తిస్థాయిలో తీర్చలేకపోతోంది. బారికేడ్ల ఏర్పాటు, కెమికల్ స్ప్రేపై దృష్టి పెడుతున్నారే తప్ప నిత్యావసరాల పంపిణీ సరిగ్గా పట్టించుకోవడం లేదని మలక్ పేట గంజ్ కంటెయిన్​మెంట్ ​జోన్ వాసి గురుదాస్ వాపోయారు.