
మెడికల్స్ మినహా ఇటలీలో ఇక అన్నీ బంద్
గ్రీస్, ఆస్ట్రియా దేశాల్లో కూడా కరోనా మృతులు
మన దేశంలో 74కి పెరిగిన కొవిడ్ బాధితులు
వేరే దేశాలకు పోవొద్దని మంత్రులకు ప్రధాని ఆదేశం
ఆందోళన పడొద్దని ప్రజలకు మోడీ సూచన
4,700 దాటిన కొవిడ్ మరణాలు
ప్రపంచం చుట్టూ కరోనా గోడ కట్టేసింది. దేశాల మధ్య ‘ఐసోలేషన్’ గీత గీసేసింది. చైనాలో మొదలైన కరోనా డేంజర్ జర్నీ, ఆగకుండా దునియా మొత్తాన్ని చేరింది. సామాన్యుడిని బెంబేలెత్తిస్తోంది. వ్యాపారాలను కుదేలు చేస్తోంది. ఎకానమీలని దెబ్బ తీస్తోంది. వైరస్ సోకిన దేశాలే కాదు, సోకని దేశాలనూ ఇబ్బంది పెడుతోంది. పెద్ద వ్యాపారాలే కాదు, చిన్న చితకా వ్యాపారాలు చేసుకునేటోళ్లపైనా అది పెద్ద దెబ్బే వేసేసింది. అందుకే డబ్ల్యూహెచ్వో దానిని ప్యాండెమిక్గా ప్రకటించింది. వెంటనే అన్ని దేశాలూ అలర్ట్ అయిపోయాయి. ఎక్కడికక్కడ లాక్డౌన్ప్రకటించేశాయి.
అమెరికాతో సహా కొన్ని దేశాలు వేరే దేశపోళ్లకు ఎంట్రీలను ఆపేశాయి. ట్రావెల్ బ్యాన్లు విధించేశాయి. ఎయిర్లైన్స్ సంస్థలు విమానాలను రద్దు చేశాయి. ఆ ప్రభావం ఇండియా సహా వివిధ దేశాల టూరిజంపై బాగానే పడింది. కేరళ, కాశ్మీర్ వంటి చోట్ల టూరిస్టుల సంఖ్య బాగా పడిపోయింది. దాల్ లేక్లో బోట్లు ఒడ్డునే నిలిచిపోయాయి. తినే తిండినీ కరోనా వదల్లేదు. మాంసానికి దానికి సంబంధం లేకున్నా, మాంసం తింటే వైరస్ అంటుతుందన్న పుకార్లు నమ్మి జనాలు చికెన్ కొనకపోవడంతో దేశంలో పౌల్ట్రీ ఇండస్ట్రీ దెబ్బతింది. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో చికెన్ రేట్లు దారుణంగా పడిపోయాయి.
దేశంలో కరోనా కేసుల సంఖ్య 74కి పెరిగింది. మంత్రులెవరూ వేరే దేశాలకు పోవొద్దని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే ఆదేశాలిచ్చారు. జనాలు గావరా పడొద్దని, ప్రభుత్వం అలర్ట్గానే ఉందని చెప్పారు. రాష్ట్రపతి భవన్కు విజిటర్లను నిషేధించారు. వివిధ దేశాలకు ఇచ్చే వీసాలను సస్పెండ్ చేశారు. ఢిల్లీలో థియేటర్లు, స్కూళ్లు బంద్ అయ్యాయి. గ్రీస్, ఆస్ట్రియా దేశాల్లో కరోనా కారణంగా గురువారం తొలి మరణాలు నమోదయ్యాయి. ఇటలీ ఇప్పటికే లాక్డౌన్ అయిపోయింది. ఆ లాక్డౌన్ ఇప్పుడు రెస్టారెంట్లు, స్టోర్లు, సెలూన్లు అన్నింటికీ చేరింది. అక్కడ ఎయిర్పోర్టుల్లో వందలాది ఇండియన్లు చిక్కుకుపోయారు.