ఓయూ హాస్టల్​లో విద్యార్థినికి కరోనా పాజిటివ్

ఓయూ హాస్టల్​లో విద్యార్థినికి కరోనా పాజిటివ్
  • ఐసోలేషన్​లో మిగతా  ముగ్గురు రూమ్ మేట్స్

ఓయూ, వెలుగు: కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతున్న టైమ్ లో ఉస్మానియా వర్సిటీ విమెన్స్ హాస్టల్ స్టూడెంట్లను వైరస్ భయం వెంటాడుతోంది. ఓయూ విమెన్స్​హాస్టల్ లో ఉంటోన్న  పీజీ బయో టెక్నాలజీ విద్యార్థినికి ఇటీవల కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు ఆమెను ఇంటికి పంపించారు. అదే రూమ్​లో ఆమెతో పాటు ఉంటోన్న మరో ముగ్గురు విద్యార్థినులను ఐసోలేషన్​లో పెట్టారు. 2 నెలల క్రితమే ఓయూలోని హాస్టల్స్ తెరుచుకున్నాయి. క్రమక్రమంగా చాలా మంది స్టూడెంట్లు హాస్టళ్లకు చేరుకుంటున్నారు. 10 రోజుల క్రితం ఓయూలోని మూడు విమెన్స్ హాస్టళ్లకు స్టూడెంట్లు పూర్తిస్థాయిలో వచ్చారు. దీంతో అధికారులు ఒకరు, ఇద్దరు ఉండే గదుల్లో ముగ్గురు, నలుగురు విద్యార్థినులను ఉంచారు. ఓయూలోని మెయిన్ విమెన్ హాస్టల్ లో ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ చదువుతోన్న ఓ విద్యార్థిని 4 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. బుధవారం ఆమె కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు ఆమెను సొంతూరికి పంపించారు. ఆమెతో పాటు అదే రూమ్ లో ఉంటోన్న ముగ్గురు విద్యార్థినులను ముందు జాగ్రత్తలో భాగంగా ఐసోలేషన్ లో ఉంచారు. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విమెన్స్ హాస్టల్ లో వైరస్ వ్యాప్తికి కారణమని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. హాస్టల్ లో కరోనా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించడం లేదని, శానిటైజర్ ఇవ్వడం, టెంపరేచర్ చెక్ లాంటి చర్యలు చేపట్టడం లేదంటున్నాయి. రూమ్ లు సరిపడా లేక ఎక్కువ మంది ఒకే దగ్గర ఉండాల్సి వస్తోందని  విద్యార్థినులు చెప్తున్నారు. అధికారులు వెంటనే కరోనా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుని, హాస్టల్ లోని విద్యార్థినులు అందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టు  చేయించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.