పీపాలు, డ్రమ్ములు, ట్యాంక్ ఫుల్ చేయించుకున్నోళ్లకు షాకింగ్ న్యూస్

పీపాలు, డ్రమ్ములు, ట్యాంక్ ఫుల్ చేయించుకున్నోళ్లకు షాకింగ్ న్యూస్

ఢిల్లీ: పెట్రోల్, డీజిల్ నిల్వలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశంలో 60 రోజులకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని.. ఎక్కడా ఇంధన కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దేశ ప్రజలు భయాందోళనలకు లోనై పెట్రోల్ బంకుల ముందు బారులు తీరవద్దని సూచించింది. క్యాన్లు, బాటిళ్లలో పెట్రోల్ కొట్టించుకోవద్దని సూచించింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఇక మన దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని సోషల్ మీడియాలో పుకార్లు వ్యాపించాయి.

2026, మార్చి 26వ తేదీ మధ్యాహ్నం కేంద్ర మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసి నోట్.. దేశంలోని జనానికి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. వాస్తవంగా ఇండియాలో 74 రోజుల వరకు ఆయిల్ నిల్వలు చేసుకునే సామర్థ్యం ఉంది. ఇప్పుడు 60 రోజులకు సంబంధించి నిల్వలు ఉన్నాయని.. యుద్ధం తర్వాత నుంచి ఆస్ట్రేలియా, రష్యా, అమెరికా నుంచి ఆయిల్ నౌకలు ఒక్కొక్కటిగా వస్తుండటంతో.. పెట్రోల్, డీజిల్ నిల్వలు క్రమంగా పెరిగి.. ఇవాల్టికి 60 రోజులకు చేరుకున్నాయని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. 

మార్చి నెలాఖరు.. ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా.. కొన్ని పెట్రోల్ బంకు యజమానులు డబ్బులు చెల్లించకపోవటంతో.. వాళ్లకు ఆయిల్ కంపెనీలు ఇంధనం ఇవ్వలేదని.. ఈ క్రమంలోనే ఆయా బంకుల్లోనే నో స్టాక్ బోర్డులు ఉన్నట్లు కేంద్రం స్పష్టంగా వివరించింది.

రాబోయే 60 రోజులు అంటే.. ఏప్రిల్, మే నెల మొత్తం.. విదేశాల నుంచి చుక్క ఆయిల్ రాకపోయినా.. ఇప్పుడు నిల్వ ఉన్న పెట్రోల్, డీజిల్ తోనే దేశం మొత్తం హ్యాపీగా.. హాయిగా నడుస్తుందని.. ఎలాంటి కొరత లేదని వివరించింది. ఇకనైనా జనం డబ్బాల్లో.. పీపాల్లో ఆయిల్ నిల్వ చేసుకోవటం మానుకోవాలని.. వాళ్లూ వీళ్లు చెప్పింది వినటం మానేయాలని సూచించింది. 

ఈ పుకార్లను నిజమని నమ్మి బెంబేలెత్తిపోయిన ప్రజలు పెట్రోల్ బంకుల ముందు క్యూ కట్టారు. ఆయిల్ కంపెనీలు క్రెడిట్ ఇవ్వకపోవడంతో కొన్ని పెట్రోల్ బంకులు మూతపడటంతో పెట్రోల్, డీజిల్ దొరకదనే  ప్రచారం మరింత ఊపందుకుంది. హైదరాబాద్ సిటీలో పెట్రోల్ బంకుల ముందు వాహనదారులు క్యూ కట్టడంతో మెయిన్ రోడ్లపై ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దీంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేసి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి వచ్చింది.