- వాట్సాప్ గ్రూపుల్లో నీట్ పేపర్ లీక్..ఎన్టీఏ నిపుణుల ద్వారానే బయటకు
- 94 పేజీల చార్జిషీట్లో సంచలన విషయాలు
- 13 మంది నిందితులతో సీబీఐ చార్జిషీట్ దాఖలు
- ప్రత్యేక కోచింగ్ పేరుతో భారీగా నగదు వసూలు చేసినట్లు వెల్లడి
న్యూఢిల్లీ: నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు కీలక నిజాలను వెలుగులోకి తెచ్చింది. ఈ కుంభకోణానికి సంబంధించి సీబీఐ దాఖలు చేసిన 94 పేజీల చార్జిషీట్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిపుణులు, మధ్యవర్తులు, కోచింగ్ సెంటర్ల పాత్రను స్పష్టంగా తేల్చింది. జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతికశాస్త్ర ప్రశ్నలు ఎన్టీఏ నుంచే ఎలా లీకయ్యాయో చార్జిషీట్ వివరంగా వెల్లడించింది.
ఎన్టీఏ నిపుణులు మనీషా గురునాథ్ మాంధరే, మనీషా సంజయ్ హవాల్దార్లు ప్రశ్నపత్రాల తయారీ సమయంలోని లొసుగులను ఆసరా చేసుకుని లీకేజీకి పాల్పడ్డారు. హోటల్ గదుల్లో వాటిని పునర్నిర్మించి, మధ్యవర్తి మనీషా సంజయ్ వాఘ్మారే ద్వారా రాజస్థాన్, హర్యానా వంటి ప్రాంతాల విద్యార్థులకు చేరవేశారు. మరోవైపు, పుణెలోని ఎన్టీఏ కెమిస్ట్రీ నిపుణుడు పీవీ కుల్కర్ణి నివసించిన రెసిడెన్షియల్ సొసైటీ 'యాక్సెస్ కంట్రోల్ యాప్' రికార్డులు ఈ కేసులో గుట్టును రట్టు చేశాయి.
ఫిజిక్స్ నిపుణురాలు మనీషా సంజయ్ హవాల్దార్ అందించిన ప్రశ్నలను తేజస్ షా డిజిటల్ రూపంలోకి మార్చి సర్క్యులేట్ చేశారు. అలాగే శివరాజ్ మోతేగాంకర్ లీకైన ప్రశ్నలతో వాట్సాప్ గ్రూపుల ద్వారా మాక్ టెస్ట్లు నిర్వహించారు. లీకైన ప్రశ్నలు, ప్రత్యేక తరగతుల పేరుతో విద్యార్థుల నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు సీబీఐ గుర్తించింది. ఈ కేసులో భాగంగా మే 13న ప్రారంభమైన అరెస్టులు, మే 22న ఎన్టీఏ ఫిజిక్స్ నిపుణురాలు మనీషా సంజయ్ హవాల్దార్ అరెస్ట్ వరకు కొనసాగాయి. మొత్తం 13 మంది నిందితులపై సీబీఐ చార్జ్షీట్ దాఖలు చేసి దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.
