లాక్డౌన్ నిబంధనలను సడలించడంతో ఢిల్లీలో కరోనా కేసులు పెరిగాయి. ఇవాళ(సోమవారం) ఈ విషయంపై మాట్లాడిన సీఎం అరవింద్ కేజ్రీవాల్…కేసులు పెరిగినా… భయపడాల్సిన అవసరం ఏమీ లేదని తేల్చి చెప్పారు. మరణాల రేటు, కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతేనే ఆందోళన చెందాలని, అప్పటి వరకూ ఎలాంటి ఆందోళనా అవసరం లేదని చెప్పారు. ప్రజలకు వైరస్ సోకి… తర్వాత కోలుకుంటే మాత్రం ఎలాంటి ఆందోళన, భయపడాల్సిన అవసరం లేదన్నారు కేజ్రీవాల్.
కరోనా ట్రీట్ మెంట్ కోసం వివిధ ప్రైవేట్ ఆస్పత్రుల్లో దాదాపు రెండు వేల పడకల వరకూ సిద్ధంగానే ఉన్నాయని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కరోనా ఇప్పట్లో తగ్గిపోయేది కాదని… ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఢిల్లీలో పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందన్నారు కేజ్రీవాల్.