పద్మారావునగర్, వెలుగు: రెజిమెంటల్ బజార్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల త్వరలో కార్పొరేట్ హంగులు అద్దుకోనుంది. సామాజిక బాధ్యతలో భాగంగా మహావీర్ ఇంటర్నేషనల్ ఉడాన్ ట్రస్ట్ ఈ పాఠశాల అభివృద్ధి కోసం రూ. కోటి నిధులను మంజూరు చేసింది. శుక్రవారం ట్రస్ట్ ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులతో కలిసి పాఠశాలను ఎమ్మెల్యే శ్రీగణేశ్ సందర్శించారు.
పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులతో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలు సామాజిక దృక్పథంతో విద్యాసంస్థల బలోపేతానికి ముందుకు రావడం శుభపరిణామన్నారు. పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందజేసిన ఉడాన్ సంస్థ ప్రతినిధులను ఈ సందర్భంగా అభినందించారు.
