సికింద్రాబాద్, వెలుగు: బంగారు నగలు తాకట్టు పేరుతో ఫైనాన్స్ కంపెనీలకు మోసగించిన దంపతులను మల్కాజిగిరి పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద రూ.20లక్షల విలువైన కారు స్వాధీనం చేసుకోవడమే కాకుండా వారి బ్యాంకు ఖాతాలోని రూ.11లక్షల నగదు సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం. మల్కాజిగిరికి చెందిన ఢీకొండ శ్యామ్కుమార్(40), దాసరి రజనీ అలియాస్ ఢీకొండ వర్షిణి(35) భార్యాభర్తలు. వీరు ఈజీ మనీ కోసం కొంతకాలంగా మోసాల బాట పట్టారు. తమ బంగారు నగలు తాకట్టులో ఉన్నాయని, వాటిని విడిపించి తెస్తామని ప్రైవేటు ఫైనాన్స్కంపెనీలను నమ్మిస్తున్నారు. తాకట్టుపెడతామని, అందుకు డబ్బులు ఇస్తే కట్టేసీ తెచ్చి మీకు ఇస్తామని వాటి రసీదులను చూపిస్తూ రూ. లక్షలు తీసుకుని ఉడాయిస్తున్నారు.
ఈనెల16న ఆనంద్బాగ్లోని కేఎల్ఎం ఫైనాన్స్ సంస్థ బ్రాంచ్ మేనేజర్ లావణ్యను కూడా నమ్మించి రూ.14,85,551 తీసుకుని పారిపోయారు. నగలు తెచ్చి ఇవ్వకపోగా ఫోన్ కూడా స్విచాఫ్ చేశారు. దీంతో ఫైనాన్స్ కంపెనీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దంపతులను అరెస్టు చేశారు. విచారణలో భాగంగా కుషాయిగూడ, కీసర పీఎస్ పరిధిలోనూ మోసాలకు పాల్పడినట్టు వెల్లడైంది. నాగారంలోని కొసమట్టం ఫైనాన్స్ కంపెనీ వద్ద రూ.14.70లక్షలు, ఏఎస్రావునగర్లోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ వద్ద రూ.14.90 లక్షలు నగదు తీసుకుని మోసగించినట్టు నిందితులు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.