బెంగళూరు: ఆటో డ్రైవర్ను చెప్పుతో కొట్టింది.. కట్ చేస్తే చివరికి జరిగింది ఇది..!

బెంగళూరు: ఆటో డ్రైవర్ను చెప్పుతో కొట్టింది.. కట్ చేస్తే చివరికి జరిగింది ఇది..!

బెంగళూరులో ఒక ఆటో డ్రైవర్కు భార్యాభర్తలు కాళ్లు మొక్కి క్షమాపణ చెప్పిన వీడియో నెట్టింట వైరల్ అయింది. అయితే ఈ క్షమాపణ వెనుక చాలానే జరిగింది. ఆదివారం సాయంత్రం 3 గంటల సమయంలో బెంగళూరులోని బెల్లందుర్లో ఉన్న సెంట్రల్ మాల్ దగ్గర రోడ్డుపై పెద్ద గొడవే జరిగింది. ఏమైందంటే.. పంఖురి మిశ్రా (28) అనే వివాహిత, ఆమె భర్త ఆదివారం సాయంత్రం 3 గంటల సమయంలో స్కూటీపై వెళుతున్నారు.

స్కూటీ పక్కనే ఒక ఆటో వెళుతుండగా.. ఆటో టైర్ తన కాలిపై నుంచి వెళ్లిందని మిశ్రా అనే మహిళ ఆటో డ్రైవర్తో గొడవ పెట్టుకుంది. వాస్తవానికి.. ఆటో వీళ్ల పక్క నుంచి వెళ్లిందే తప్ప ఆమె కాలికి ఎలాంటి గాయం కాలేదు. అయినప్పటికీ ఆటో డ్రైవర్ లోకేష్తో ఆ మహిళ, ఆమె భర్త వాగ్వాదానికి దిగారు. సదరు మహిళ పంఖురి మిశ్రా నడిరోడ్డుపై పెద్ద సీనే చేసింది. ఆటో డ్రైవర్ తనతో తప్పుగా ప్రవర్తించాడని ఆరోపించింది. ఈ దృశ్యాలను ఆమె భర్త వీడియో తీశాడు.

రోడ్ రేజ్ ఘటనను కాస్తా మహిళతో అసభ్య ప్రవర్తన ఘటనగా పంఖురి మిశ్రా మార్చే ప్రయత్నం చేసింది. ఆటో డ్రైవర్ను హిందీలో బూతులు తిడుతూ, ఒకటికి రెండు సార్లు అతనిని చెప్పుతో కొట్టి నానా రచ్చ చేసింది. అయితే.. ఆ ఆటో డ్రైవర్ జరిగిందంతా వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై ఆటో డ్రైవర్ లోకేష్ మాట్లాడుతూ.. మిశ్రా అనే మహిళ తనతో కన్నడలో కాకుండా తనకు ఏమాత్రం అర్థం కాని హిందీలో మాట్లాడిందని.. అందుకే వీడియో తీశానని చెప్పుకొచ్చాడు. ఈ గొడవ జరిగిన తర్వాత ఆటో డ్రైవర్ లోకేష్ తనను చెప్పుతో కొట్టిన మిశ్రాపై బెల్లందుర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మిశ్రా స్వస్థలం బీహార్. బెంగళూరులో ఆమె తన భర్తతో కలిసి ఉంటోంది.

ALSO READ : కరోనాపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు... 6 వారాల్లో రిపోర్ట్ ఇవ్వాలంటూ కేంద్రానికి ఆదేశాలు..

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడం, కన్నడిగులు ఆ మహిళ ప్రవర్తనపై భగ్గుమనడంతో ఈ కేసు బెంగళూరులో హాట్ టాపిక్ అయింది. అయితే.. ఈ కథ ఊహించని మలుపు తిరిగింది. ఏం జరిగిందో తెలియదు గానీ.. మిశ్రా, ఆమె భర్త ఆటో డ్రైవర్తో రాజీకొచ్చారు. పంఖురి మిశ్రా, ఆమె భర్త ఆటో డ్రైవర్ కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరారు. తాను గర్భవతినని, తనకు ఏదైనా జరిగితే గర్భం కోల్పోతాననే కంగారులో అలా చేశానే తప్ప ఆటో డ్రైవర్లపై తనకు ఎలాంటి ద్వేషం లేదని పంఖురి మిశ్రా చెప్పుకొచ్చింది. బెంగళూరు అన్నా, బెంగళూరు కల్చర్ అన్నా.. కన్నడ ప్రజలు చూపించే ప్రేమాభిమానాలన్నా తమకు ఎనలేని గౌరవం అని పంఖురి మిశ్రా ఆటో డ్రైవర్ కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరడంతో ఈ కథ సుఖాంతమైంది.