కొత్త జంట కిడ్నాప్.. వేర్వేరు రాష్ట్రాల్లో పడేసిన మృతదేహాలు

కొత్త జంట కిడ్నాప్.. వేర్వేరు రాష్ట్రాల్లో పడేసిన మృతదేహాలు
  • రాష్ట్రాలు తిప్పుతూ కొట్టిచంపిన బంధువులు

యూపీ: ఉత్తర ప్రదేశ్‌‎లో అమానుష ఘటన జరిగింది. పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నందుకు ఓ జంటను అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఒక రాష్ట్రంలో కిడ్నాప్ చేసి.. మరో రాష్ట్రంలో చంపేసి.. ఇద్దరి మృతదేహాలను వేర్వేరు రాష్ట్రాలలో పడేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ సిర్సాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జహంగీర్‌పూర్‎కు చెందిన ఓ యువకుడు.. తన ఇంటికి పొరుగున నివసించే మైనర్ బాలికను ప్రేమించాడు. పెళ్లికి పెద్దలను ఒప్పించడంలో ఇరువురు విఫలమయ్యారు. దాంతో ఇద్దరూ కలిసి జూలై 31న ఊరు నుంచి పారిపోయారు.

ప్రేమికులిద్దరూ ఢిల్లీకి చేరుకొని పెళ్లి చేసుకొని అక్కడే కాపురం పెట్టారు. అయితే వారి సమాచారం తెలుసుకున్న అమ్మాయి బంధువులు.. ఢిల్లీకి చేరుకొని దంపతులిద్దరినీ కిడ్నాప్ చేశారు. అక్కడినుంచి వారిని జీప్‌లో మధ్యప్రదేశ్‌లోని భింద్‌కు తీసుకెళ్లారు. ఆ తర్వాత భింద్ నుంచి గ్వాలియర్‌కు తీసుకెళ్తూ మార్గమధ్యంలో యువకుడిపై దాడి చేశారు. యువకుడి ప్రైవేట్ భాగాలలో కత్తితో దాడిచేసి.. అవయవాలను గాయపరిచారు. అత్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝాన్సీ వెళ్లే హైవేపై యువకుడిని హతమార్చారు. అనంతరం యువకుడి మృతదేహాన్ని రాజస్థాన్‎లో పడేశారు. అదేవిధంగా.. బాలికను ప్లాస్టిక్ తాడు సాయంతో ఉరేసి చంపారు. ఆమె డెడ్ బాడీని మధ్యప్రదేశ్‎లోని ధోల్పూర్ ఏరియాలో వదిలేశారు. కాగా.. యువకుడి మృతదేహం ఆగస్టు 5న పోలీసులు కనుగొన్నారు. గుర్తు తెలియని వ్యక్తులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ తర్వాత 5 రోజులకు ఆగష్టు 10న తన కొడుకు కనిపించడంలేదని యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం మూడు రోజులకు బాలిక మృతదేహం ధోల్పూర్‎లో లభించడంతో పోలీసులు అనుమానాస్పదంగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బాలిక కుటుంబసభ్యుల మొబైల్ ఫోన్ల లొకేషన్‌ను పరిశీలించగా.. కీలక విషయాలు తెలిశాయి. బాలిక బంధువులు వరుసగా ఢిల్లీ, భింద్, గ్వాలియర్ మరియు ధోల్పూర్‌కు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దాంతో బాలిక కుటుంబాన్ని పిలిచి విచారణ చేయగా.. తామే దంపతులిద్దరినీ హత్య చేసినట్లుగా ఒప్పుకున్నారు. దంపతుల వయసుల తేడా కారణంగానే వారి హత్యలు జరిగుండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.