- అప్లికేషన్ అందలేదన్న కవిత తరఫు న్యాయవాదులు
- ఏప్రిల్ 6వ తేదీనే ప్రశ్నించామన్న సీబీఐ
- షరతులు అమలు చేయాలన్ని సూచించిన కోర్టు
- తదుపరి విచారణ ఏప్రిల్ 26కు వాయిదా
ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితకు మరోమారు నిరాశే ఎదురైంది. తీహార్ జైలులో ఉన్న కవిత.. తనను సీబీఐ ప్రశ్నించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఏప్రిల్ 6న కోర్టును ఆశ్రయించారు. సీబీఐ అప్లికేషన్ తమకు అందలేదని వివరించారు. కవితను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కోరారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ కొనసాగింది.
కవితను ప్రశ్నించడంపై రిప్లై దాఖలు చేయడం లేదని సీబీఐ కోర్టుకు తెలిపింది. శనివారం రోజే ఆమెను ప్రశ్నించామని వివరించింది. మరోవైపు సీబీఐ కౌంటర్ దాఖలు చేయకపోవడంపై కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై తాము తమ వాదనలు వినిపిస్తామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. భవిష్యత్తులో కవితను ప్రశ్నించాల్సి వస్తే, ముందుగానే తమకు సమాచారం ఇవ్వాలని సీబీఐకి చెప్పామని న్యాయమూర్తి కవిత తరపు న్యాయవాదులకు సూచించారు. ఈ మేరకు తదుపరి విచారణ ఏప్రిల్ 26 మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు.
షరతులు వర్తిస్తాయి
ఈ కేసుకు సంబంధించి తీహార్ జైలులో ఉన్న కవితను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టును సంప్రదించగా, న్యాయస్థానం షరతులతో కూడిన పర్మిషన్ మంజూరు చేసింది. ఆమెను ప్రశ్నించేందుకు ఒక రోజు ముందే జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సీబీఐని ఆదేశించింది. విచారణ సమయంలో తప్పని సరిగా మహిళా కానిస్టేబుళ్లు ఉండాలని షరతు పెట్టింది. ఇదే సమయంలో ప్రశ్నించే సమయంలో ల్యాప్ టాప్, ఇతర స్టేషనరీ తీసుకొచ్చేందుకు సీబీఐకి ఓకే చెప్పింది.