
హైదరాబాద్,వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిమాణం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు జూన్ 20వ తేదీలోపు తమ ముందు హాజరుకావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. విచారణకు సహకరించకుండా ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయిన సంగతి తెలిసిందే. ప్రభాకర్ రావుపై ఇప్పటికే లుక్ ఔట్ సర్క్యూలర్, రెడ్ కార్నర్, పాస్ పోర్టు రద్దు సహా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నట్లు పోలీసులు నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పలు పిటీషన్లలో వెల్లడించారు.
ఈ క్రమంలోనే నాన్ బెయిల్ వారెంట్ జారీ కావడంతో ప్రకటిత నేరస్థుడి(ప్రొక్ల్లైమ్డ్ అఫెండర్)గా ప్రకటించాలని కోరుతూ జనవరిలో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను నాంపల్లి కోర్టు ఆమోదించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జూన్ 20 లోగా హాజరుకాకపోతే ఆయనకు సంబంధించిన ఆస్తులను కోర్టు తన అధీనంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.