యువతిపై సామూహిక అత్యాచారం.. ఆరుగురు అరెస్ట్

యువతిపై సామూహిక అత్యాచారం.. ఆరుగురు అరెస్ట్

నిజామాబాద్ నగరంలో యువతిపై అత్యాచార ఘటనను పోలీసులు చేధించారు. నగరంలోని బస్టాండ్ సమీపంలో రెనోవేషన్ లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రి  బిల్డింగ్ లో బుధవారం తెల్లవారు జామున యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్టు నిర్ధారించారు. నగరానికి చెందిన నవీన్‌ కుమార్‌ అనే వ్యక్తితో యువతి వెళ్లగా.. అతడితో పాటు మరో ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారని నగర పోలీస్‌ కమిషనర్‌ కార్తికేయ ప్రెస్ మీట్ లో తెలిపారు. ఇందుకు మరో ముగ్గురు సహకరించారన్నారు. 

నిన్న(బుధవారం) రాత్రి ఒంటిగంట తర్వాత డయల్‌ 100కి కాల్‌ వచ్చిందని.. ఘటనా స్థలానికి  వెళ్లి చూడగా 18 ఏళ్ల యువతి కన్పించనినట్లు తెలిపారు సీపీ కార్తికేయ. రాత్రి మాట్లాడే పరిస్థితి లేకపోవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించామన్నారు. కోలుకున్నాక ఆమెను సఖి కేంద్రానికి పంపామన్నారు. ఈ నెల 28న నవీన్‌ కుమార్‌ అనే వ్యక్తిని యువతి కలిసిందని.. తర్వాత నగర శివారులో ఆహారం,మద్యం సేవించారని..ఆ తర్వాత నిర్మాణంలో ఉన్న ఆస్పత్రి దగ్గరకు వెళ్లినట్లు తెలిపారు. యువతిపై ముగ్గురు అత్యాచారం చేశారని.. మరో ముగ్గురు సహకరించారని చెప్పారు. ఈ దారుణానికి పాల్పడిన ఆరుగురు ఆచూకీ సాయంత్రానికి తెలిసిందన్నారు. నిన్న ఐదుగురిని.. ఉదయం ఒకరిని అరెస్టు చేశామని సీపీ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పర్చి రిమాండ్ కు తరలించామని వివరించారు.

రాత్రి వేళల్లో ప్రత్యేక  నిఘా పెట్టడంతో పాటు.. బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో పెట్రోలింగ్ బృందాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు సీపీ కార్తికేయ.