సిద్దిపేట రూరల్, వెలుగు: ఫోన్ పోయిన వెంటనే బాధితులు సీఈఐఆర్లో రిజిస్టర్ చేసుకోవాలని సీపీ రష్మీ పెరుమాళ్ అన్నారు. ఫోన్ల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసిన 127 మొబైల్ ఫోన్లను సీపీ బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెల్ ఫోన్ పోగొట్టుకుంటే ఆందోళన చెందవద్దని సీఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని అన్నారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా ఈఏడాది 344 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించినట్లు చెప్పారు. ఫోన్లు రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన సీఈఐఆర్ బృందం, సీఐ మొగిలి, కానిస్టేబుల్ రమేశ్, రాజిరెడ్డి, హరికృష్ణ, స్వామి, శ్రీకాంత్ను సీపీ అభినందించారు.
