ఆపరేషన్ కగార్​ను వెంటనే ఆపాలి : కలవేని శంకర్​

ఆపరేషన్ కగార్​ను వెంటనే ఆపాలి : కలవేని శంకర్​

కోల్​బెల్ట్/నస్పూర్, వెలుగు: మావోయిస్టులను అంతమొందించే లక్ష్యంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్​కగార్​ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేని శంకర్ ​డిమాండ్ చేశారు. ఆదివారం రామకృష్ణాపూర్​లోని సింగరేణి కమ్యూనిటీ హాల్​లో నిర్వహించిన సీపీఐ పార్టీ మూడో మహాసభలకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రజలు, సైనికుల మీద దాడులు చేసే ఉగ్రవాదులను వదిలిపెట్టి సమాజంలోని అసమానతలను దూరం చేసేందుకు ఉద్యమిస్తున్న కమ్యూనిస్టులపై మోదీ సర్కార్​ దాడులు చేయడం సరికాదన్నారు. 

కమ్యూనిస్టు పార్టీ పేద ప్రజల గొంతుక అని అన్నారు. మహాసభలో భాగంగా సీపీఐ లీడర్లు, కార్యకర్తలు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం అమరవీరుల తాత్కాలిక స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 45 కౌన్సిల్,17 కార్యవర్గ సభ్యులతో నూతన కమిటీని ఎన్నుకున్నారు. రామకృష్ణాపూర్​ పట్టణ కార్యదర్శిగా మిట్టపెల్లి శ్రీనివాస్​ను నాలుగోసారి ఎన్నుకున్నారు.

సీపీఐ మహాసభలను సక్సెస్ చేయండి

సీపీఐ మండల, జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కలవేని శంకర్ కోరారు. నస్పూర్​లోని కృష్ణకాలనీలో జిల్లా కార్యవర్గ సభ్యుడు కారుకూరి నగేశ్ ఆధ్వర్యంలో కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు, కోశాధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. జూన్ 8న సీసీసీ నర్సయ్య  భవన్ లో నిర్వహిస్తున్న మండల మహాసభ, జూన్ 21, 22న మంచిర్యాలలో నిర్వహించే జిల్లా మహాసభలను సక్సెస్ చేయాలన్నారు. పేదలకు కమ్యూనిస్టు పార్టీ తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరని అన్నారు. 

ఆయా కార్యక్రమాల్లో సీపీఐ జిల్లా సెక్రటరీ రామడుగు లక్ష్మణ్, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, జిల్లా కార్యవర్గ సభ్యులు లింగయ్య, బి.సుదర్శన్, లింగం రవి, మల్లేశ్, జిల్లా సమితి సభ్యులు స్థానిక లీడర్లు పాల్గొన్నారు.