రాహుల్ గాంధీ పై అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ కుటుంబం ఈ దేశం కోసం త్యాగాలు చేసిందన్నారు.
ఎ ప్రామిస్డ్ ల్యాండ్లో బుక్ లో రాహుల్ గాంధీకి తన గురించి తనకే తెలీదని.. అతనికి ఆ గుణం ఉందంటూ రాశారు. అంతేకాదు.. రాహుల్ కోర్సు చేసే విద్యార్థిలా ఉపాధ్యాయుడిని ఆకట్టుకోవటానికి ఉత్సాహంగా ఉంటాడని.. కాని సబ్జెక్ట్లో లోతుగా వెళ్లే విషయం రాహుల్లో లేదన్నారు. విషయం నేర్చుకోవాలనే అభిరుచి రాహుల్లో లేదంటూ ఆ పుస్తకంలో ఒబామా రాశారు.
దీనిపై తీవ్రంగా స్పందించిన జగ్గారెడ్డి…ఓబామ ఇలాంటి కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదన్నారు. అంతేకాదు అమెరికా రాజకీయాలు వేరు..అక్కడ కుల,మతాల రాజకీయాలు ఉండవన్నారు. భారతదేశం రాజకీయం వేరు.. ఇక్కడ వంద కులాలు, 10 మతాలు ఉంటాయని తెలిపారు. భారతదేశంలో ప్రస్తుతం ఎమోషనల్ పొలిటిక్స్ నడుస్తున్నాయని తెలిపారు. బీజేపీ హిందు రాజకీయం,ఎంఐఎం ముస్లిం ,టీఆర్ ఎస్ ప్రాంతీయ వాద రాజకీయం చేస్తోందని స్పష్టం చేశారు. భారత దేశంలో ఎక్కువ కుల పరమైన రాజకీయాలు నడుస్తాయని.. అయితే కాంగ్రెస్ కు కుల,మత రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యూలర్ పార్టీ అని.. స్వాతంత్ర్యం నుండి కాంగ్రెస్ పార్టీ కి ఒక చరిత్ర ఉందని తేల్చి చెప్పారు. అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎమోషనల్ పాలిటిక్స్ చేయదన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ భావంతో ప్రపంచ దేశాల సత్సంబంధాలతో నడిచే పార్టీ అని తెలిపారు. అవగాహన లేని ఒబామా రాహుల్ గాంధీ పై విమర్శలు చేయడం సరైంది కాదన్నారు జగ్గారెడ్డి.